ప్రజలు సులభమైన మార్గాల్లో, తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకోవడమే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోందన్నారు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు. మీ అత్యాశే వారి పెట్టుబడి.. కష్టపడకుండా డబ్బు వస్తుందని ఎవరైనా చెబుతున్నారంటే.. దాని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని గ్రహించాలని సూచించారు. దురదృష్టవశాత్తూ బాగా చదువుకున్న వారు సైతం ఈ మాయమాటల ట్రాప్లో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. పరువు పోతుందన్న భయంతో చాలామంది బయటకు చెప్పుకోలేకపోతున్నారని అన్నారు.
ప్రతి దానికి ఫోన్ మీద అతిగా ఆధారపడటం వల్లే ఈ మోసాలు పెరుగుతున్నాయని చెప్పారు. కేవలం 299 రూపాయలకే లక్కీ డ్రాలో కారు వస్తుందనే మాటలు నూటికి నూరు శాతం అబద్ధమన్నారు. మీరు వందల రూపాయలే కదా అని ఆశపడితే.. నేరగాళ్లు ఇలా వేల మందిని మోసం చేసి లక్షలు గడిస్తున్నారని చెప్పారు. మీ ఫోన్కు వచ్చే ప్రతి అపరిచిత లింక్ను క్లిక్ చేయొద్దని.. మీకు తెలిసిన వారు పంపిన నమ్మకమైన లింక్స్ను మాత్రమే ఓపెన్ చేయాలని డీసీపీ అరవింద్ సూచించారు.
ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని చెప్పారు. మోసం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేస్తే, మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం మెరుగ్గా ఉంటుందన్నారు. అనవసరంగా అత్యాశపడి కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేసుకోవద్దని... అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

