హనుమకొండ సిటీ, వెలుగు : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, పొల్యూషన్ను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలంటూ ‘జ్వాలా’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లాస్టిక్కు శవయాత్ర నిర్వహించారు. వరంగల్ నగరంలోని వేయి స్తంభాల గుడి నుంచి హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా జ్వాలా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ... ప్లాస్టిక్ నిషేధంపై కఠిన చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయన్నారు. వరంగల్ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తున్న దుకాణాలకు ఫైన్లు వేస్తున్న ఆఫీసర్లు, వాటిని తయారు చేసే పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కనీసం ప్రభుత్వ శాఖల్లోనైనా ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని, ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్బీ కాలేజీ ఎన్సీసీ ఆఫీసర్ సదానందం, జ్వాల సంస్థ సభ్యులు అమర్నాథ్, బుర్రి కృష్ణమూర్తి, ప్రకాశ్, గుండపు సాయిచంద్, రవీందర్, కత్తుల రాజు పాల్గొన్నారు.
