లారీ డ్రైవర్​ నిర్లక్ష్యానికి.. ఆరుగురు బలి

లారీ డ్రైవర్​ నిర్లక్ష్యానికి.. ఆరుగురు బలి
  • వరంగల్‍ జిల్లా ఇల్లంద వద్ద ఘోర ప్రమాదం
  • రాంగ్​ రూట్​లో వచ్చి ఆటోను ఢీకొన్న లారీ
  • నలుగురు అక్కడికక్కడే మృతి.. మరో ఇద్దరు హాస్పిటల్​లో మృతి
  • మృతుల్లో ఐదుగురు రాజస్థాన్‍ వలసజీవులు
  • తేనె అమ్ముకునేందుకు బయల్దేరి దుర్మరణం 

వరంగల్‍/వర్ధన్నపేట/వరంగల్‍ సిటీ, వెలుగు: వరంగల్‍ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్​ రూట్​లో వచ్చిన లారీ.. ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆటో డ్రైవర్​ సహా నలుగురు అక్కడికక్కడే చనిపోగా .. మరో ఇద్దరు ట్రీట్‍మెంట్‍ తీసుకుంటూ మృతిచెందారు. గాయపడ్డవాళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను వరంగల్​లోని కరీమాబాద్‍ ఏసీరెడ్డి కాలనీకి చెందిన భట్టు శ్రీనివాస్‍ (42),  రాజస్థాన్‍ రాష్ట్రం జైపూర్​కు చెందిన కురేరి సురేశ్​ (50), జాబోత్‍ కురేరి (25), అమిత్‍ మండల్‍ (20), నితిన్‍ మండల్‍ (20), రూప్‍చంద్‍ (35)గా గుర్తించారు. 

తేనె అమ్ముకునేందుకు బయల్దేరి..!

రాజస్థాన్‍ నుంచి బతుకుదెరువు కోసం  వలసవచ్చిన వారు కొంతకాలంగా వరంగల్‍ లేబర్‍ కాలనీలో ఉంటున్నారు. రోజూ ఇక్కడి నుంచి వర్ధన్నపేట, రాయపర్తి తదితర ప్రాంతాలకు వెళ్లి రోడ్ల పక్కన తేనె అమ్ముకుంటుంటారు.  బుధవారం పొద్దున కూడా ఆరుగురు రాజస్థానీలు భట్టు శ్రీనివాస్‍ ఆటోను మాట్లాడుకొని ఖమ్మం హైవే మీదుగా తొర్రూర్‍ వైపు బయలుదేరారు. ఉదయం 7.12 గంటలకు వర్ధన్నపేట సమీపంలోని ఇల్లంద వద్ద వరంగల్‍ నుంచి రాంగ్​ రూట్​లో వస్తున్న రాజస్థాన్‍కు చెందిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. 

అందులో ఉన్నవారు బయటకు రాలేక ఇరుక్కుపోయారు. పోలీసులు, స్థానికులు వారిని బయటకు తీశారు. భట్టు శ్రీనివాస్‍, కురేరి సురేశ్​, జాబోత్‍ కురేరి, అమిత్‍ మండల్‍ స్పాట్​లోనే చనియారు. నితిన్‍ మండల్ , రూప్‍చంద్‍, అమీర్‍ తీవ్రంగా గాయపడగా.. వరంగల్​లోని ఎంజీఎం హస్పిటల్‍ తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నితిన్‍ మండల్​, రూప్‍చంద్‍ మరణించగా.. అమీర్‍ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. నలుగురి మృతదేహాలకు వర్ధన్నపేట హస్పిటల్​లో, మిగతా ఇద్దరి మృతదేహాలకు ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆటో డ్రైవర్‍ శ్రీనివాస్‍ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా లారీని నడిపిన డ్రైవర్‍ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ఘటనా స్థలాన్ని వరంగల్‍ సీపీ  ఏవీ.రంగనాథ్‍ పరిశీలించారు.