రూ.12లక్షల మోసం : డబ్బులు డబుల్ చేస్తామంటూ టోకరా

రూ.12లక్షల మోసం : డబ్బులు డబుల్ చేస్తామంటూ టోకరా

యాదాద్రి భువనగిరి: తన మంత్రతంత్రాలతో డబ్బులను డబుల్ చేస్తానని నమ్మించి, రూ.12 లక్షలతో చెక్కేసిన మాయగాళ్లు చివరకు పోలీసులకు చిక్కారు. ఇంద్ర సినిమాలో గోల్డ్ ను చంబులో పెడితే రెట్టింపు అయితి అనే స్టైల్లో ప్లాన్ వేశారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. చౌటుప్పల్‌ మండలం కైతాపురంలో ఐలయ్య అనే వ్యక్తి నుంచి నిందితులు రూ.12 లక్షలు వసూలు చేశారు. వాటిని రెట్టింపు చేస్తామని నమ్మించి.. ఈ నెల 21న ఐలయ్య వద్ద రూ.12లక్షలు తీసుకుని ఓ సంచిలో ఉంచి వెళ్లారు. రెండు రోజుల తర్వాత సంచి తెరిచి చూడగా అందులో తెల్లకాగితాలు దర్శనమిచ్చాయి. దీంతో అవాక్కయిన బాధితుడు మోసపోయానని గమనించి పోలీసులను ఆశ్రయించాడు.

గుంటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు తనను మోసం చేశారని ఫిర్యాదులో తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆరా తీశారు. షేక్‌ సైదా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.12లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు.