భూవివాదంతో బాబాయిపై గొడ్డలితో దాడి

భూవివాదంతో బాబాయిపై గొడ్డలితో దాడి

వీణవంక, వెలుగు: నాలుగు గుంటల భూమి కోసం సొంత బాబాయిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. కరీంనగర్​జిల్లా వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామానికి చెందిన చుక్కల బుచ్చయ్య(60) , అతడి  సోదరుడికి ఇంటి కొట్టం వద్ద నాలుగు గుంటల భూమికి సంబంధించి వివాదం ఉంది.  దీంతో కొన్నేండ్లుగా ఆ భూమి తమకివ్వాలని సోదరుడి కొడుకు చుక్కల శ్రీనివాస్.. బుచ్చయ్యపై​ఒత్తిడి చేస్తున్నాడు. దీనిపై చాలాసార్లు గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు  చేశారు. 

భూమి ఇవ్వకుండా పంచాయితీ పెట్టిస్తున్నాడన్న కోపంతో గురువారం బుచ్చయ్యను వెంబడించి గ్రామస్తులందరూ చూస్తుండగానే  శ్రీనివాస్ గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బుచ్చయ్యను జమ్మికుంట దవాఖానకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.