- కవల శిశువుల దత్తత వ్యవహారంలో పలువురిపై కేసు
- ఆలస్యంగా వెలుగులోకి.. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో ఘటన
రాయికల్, వెలుగు: కవల శిశువుల దత్తత వ్యవహారం జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో కలకలం రేపింది. రాయికల్ మండలానికి చెందిన గంగజల అనే మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. డెలివరీ అనంతరం ఆమె చనిపోయింది. దీంతో తల్లి ప్రేమకు దూరమైన ఇద్దరు చిన్నారుల ఆలనాపాలన తండ్రి సాయిలుపై పడింది.
ఆర్థిక, కుటుంబ పరిస్థితుల కారణంగా పిల్లలను పెంచడం అతడికి భారంగా మారింది. ఈక్రమంలో పిల్లలను జగిత్యాలకు చెందిన లాయర్ బెజ్జారపు ప్రవీణ్కుమార్ద్వారా జగిత్యాల పట్టణంలో దంపతులకు ఒక శిశివును, రాయికల్ పట్టణంలో దంపతులకు మరో శిశువును దత్తత ఇచ్చాడు.
విషయం తెలుసుకున్న స్థానికులు1098కు ఫిర్యాదు చేయడంతో సంబందిత అధికారులు రంగంలోకి దిగి పూర్తి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు తండ్రి, లాయర్, దత్తత తీసుకున్న వారితో పాటు సహకరించిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై గత నెల 4న చైల్డ్ హెల్ప్ లైన్ జగిత్యాల జిల్లా కో ఆర్డినేటర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
