23 ఏళ్ళ క్రితం వెళ్లి.. మలేషియాలో జగిత్యాల జిల్లావాసి అనుమానాస్పద మృతి... చివరిచూపు కుటుంబం ఎదురుచూపులు

23 ఏళ్ళ క్రితం వెళ్లి..  మలేషియాలో జగిత్యాల జిల్లావాసి అనుమానాస్పద మృతి... చివరిచూపు కుటుంబం ఎదురుచూపులు

జీవనోపాధి కోసం విదేశాలకు వలస వెళ్లేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. అప్పులపాలయ్యి కొంతమంది వలస వెళితే, కుటుంబ బాధ్యతల రీత్యా మరికొంతమంది గల్ఫ్, మలేషియా లాంటి దేశాలకు వలస వెళ్తుంటారు. అలా వెళ్ళినవారు కాస్తో కూస్తో.. డబ్బులు సంపాదిఇందుకొని స్వదేశానికి తిరిగి వస్తుంటారు. కానీ.. అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఎదురై.. ఇంటికి తిరిగిరాలేక తిప్పలు పడే అభాగ్యుల గురించి తరచూ వింటూనే ఉంటాం. ఇంకొంతమంది అక్కడే మరణిస్తే.. చివరిచూపు కోసం వారి కుటుంబాలు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. జగిత్యాల జిల్లా హబ్సీపూర్ కి చెందిన కారం నర్సయ్య కుటుంబ దీన గాధ కూడా ఇలాంటిదే.. 

23 ఏళ్ళ క్రితం జీవనోపాధి కోసం మలేషియాకు వెళ్ళాడు నర్సయ్య. భార్య, ముగ్గురు కూతుళ్లను వదిలి వెళ్లిన నర్సయ్య ఇండియాకు రాకుండానే మలేషియా నుండి పెద్దకూతురు వివాహం జరిపించాడు. ఇక్కడిదాకా అంతా సవ్యంగానే సాగింది.. కానీ, ఏడాది కిందటి నుంచి నర్సయ్యకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి.. ఈ విషయం ఆరు నెలల క్రితం తన కుటుంబసభ్యులకు చెప్పాడు. ఇక అప్పటి నుంచి కుటుంబసభ్యులకు ఫోనులో అందుబాటులో లేకుండాపోయాడు నర్సయ్య. 

నర్సయ్య ఫోనులో కూడా అందుబాటులో లేకుండా పోవడంతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యారు కుటుంబసభ్యులు. నర్సయ్య పని చేసే కంపెనీలో తోటి వర్కర్లకు ఆరా తీసినప్పటకీ అతని గురించి సమాచారం లభించలేదు. ఇటీవల మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న కుటుంబీకులు. ఎంబసీ అధికారుల ద్వారా విషయం తెలుసుకోగా..  నాలుగు రోజుల క్రితం నర్సయ్య  మృతి చెందినట్లు తెలిపారు.

విషయం తెలుసుకున్న నర్సయ్య కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.  23 ఏళ్లుగా తన తండ్రిని చూడలేదని, కనీసం చివరి చూపైనా చూసేలా తన తండ్రి శవాన్ని తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూతుళ్లు. తన తండ్రి చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడిందని.. ప్రభుత్వం  ఆదుకోవాలని వేడుకుంటున్నారు.  నర్సయ్య శవాన్ని రప్పించే విధంగా అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్.