
- హత్యచేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన దుండగులు
జీడిమెట్ల, వెలుగు: హైదరాబాద్ బాచుపల్లిలోని నిర్మానుష్య ప్రదేశంలో సూట్కేసులో ఓ యువతి డెడ్బాడీ లభ్యం కావడం కలకలం రేపింది. యువతిని అత్యంత కిరాతకంగా చంపి సూట్కేస్లో కుక్కి బాచుపల్లి రెడ్డీస్ల్యాబ్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో దుండగులు పడేశారు. బుధవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన స్థానికులకు దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డెడ్బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతిని ఎక్కడో చంపి సూట్కేస్లో కుక్కి ఇక్కడికి తెచ్చి పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ మెడలో మంచానికి వాడే నైలాన్ తాడు ఉండటంతో ఆమెకు ఉరివేసి చంపి ఉంటారని తెలుస్తోంది.
యువతి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాలు ఉంటుంది. మృతురాలి ఒంటిపై మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ ఉంది. బాడీ మొత్తం డీకంపోజింగ్స్టేజీలో ఉండటంతో 15 రోజల క్రితమే హత్యచేసి డెడ్బాడీని ఇక్కడికి తెచ్చి పడేసి ఉంటారని తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని బాలానగర్ డీసీపీ సురేశ్కుమార్, కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్రెడ్డి, సీఐ ఉపేందర్పరిశీలించారు. కేసు దర్యాప్తు కోసం స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. పలు పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన మహిళ మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు.
మృతిచెందిన యువతి గురించి ఎలాంటి సమాచారం ఉన్నా బాచుపల్లి పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని సీఐ ఉపేందర్ కోరారు. కాగా, ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారనుంది. యువతి ఏ సమయంలో చనిపోయిందనే విషయం తెలిస్తే దర్యాప్తు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానరహదారుల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే, ఏ విధంగా చనిపోయిందనే విషయం సైతం పోస్టుమార్టంలో తేలనుంది.