సూట్​కేసులో యువతి డెడ్​బాడీ..బాచుపల్లిలో కలకలం రేపిన ఘటన

సూట్​కేసులో యువతి డెడ్​బాడీ..బాచుపల్లిలో కలకలం రేపిన ఘటన
  • హత్యచేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన దుండగులు

జీడిమెట్ల, వెలుగు: హైదరాబాద్ బాచుపల్లిలోని నిర్మానుష్య ప్రదేశంలో సూట్​కేసులో ఓ యువతి డెడ్​బాడీ లభ్యం కావడం కలకలం రేపింది. యువతిని అత్యంత కిరాతకంగా చంపి సూట్​కేస్​లో కుక్కి బాచుపల్లి రెడ్డీస్​ల్యాబ్​ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో దుండగులు పడేశారు. బుధవారం ఉదయం వాకింగ్​కు వెళ్లిన స్థానికులకు దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్​కు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతిని ఎక్కడో చంపి సూట్​కేస్​లో కుక్కి ఇక్కడికి తెచ్చి పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ మెడలో మంచానికి వాడే నైలాన్​ తాడు ఉండటంతో ఆమెకు ఉరివేసి చంపి ఉంటారని తెలుస్తోంది. 

యువతి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాలు ఉంటుంది. మృతురాలి ఒంటిపై మెరూన్​ కలర్​ పంజాబీ డ్రెస్​ ఉంది. బాడీ మొత్తం డీకంపోజింగ్​స్టేజీలో ఉండటంతో 15 రోజల క్రితమే హత్యచేసి డెడ్​బాడీని ఇక్కడికి తెచ్చి పడేసి ఉంటారని తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని బాలానగర్​ డీసీపీ సురేశ్​కుమార్, కూకట్​పల్లి ఏసీపీ రవికిరణ్​రెడ్డి, సీఐ ఉపేందర్​పరిశీలించారు. కేసు దర్యాప్తు కోసం స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు.  పలు పోలీస్​స్టేషన్ల పరిధిలో నమోదైన మహిళ మిస్సింగ్  కేసులను పరిశీలిస్తున్నారు.

 మృతిచెందిన యువతి గురించి ఎలాంటి సమాచారం ఉన్నా బాచుపల్లి పోలీస్​ స్టేషన్​లో తెలియజేయాలని సీఐ ఉపేందర్​ కోరారు. కాగా, ఈ కేసులో పోస్టుమార్టం​  నివేదిక కీలకంగా మారనుంది. యువతి ఏ సమయంలో చనిపోయిందనే విషయం తెలిస్తే దర్యాప్తు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు  కొనసాగిస్తున్నారు. ప్రధానరహదారుల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే, ఏ విధంగా చనిపోయిందనే విషయం సైతం పోస్టుమార్టం​లో తేలనుంది.