ప్రియుడి వేధింపులు తట్టుకోలేక ఉరేసుకున్న యువతి

ప్రియుడి వేధింపులు తట్టుకోలేక ఉరేసుకున్న యువతి

బయ్యారం/మహబూబాబాద్ అర్బన్​, వెలుగు: ప్రియుడి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం సాంబతండాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాంబ తండాకు చెందిన ధర్మసోత్ సునీత(22) బీఈడీ చేసింది. అదే తండాకు చెందిన మాలోత్​శివ, సునీత ఒకర్నొకరు ఇష్టపడ్డారు. పెండ్లి  చేసుకోవాలని అనుకున్నారు. విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. శివ కుటుంబసభ్యులు పెండ్లికి ఒప్పుకోలేదు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సునీత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

4 పేజీల సూసైడ్ ​నోట్​

సునీత తన ఆత్మహత్యకు కారణాలు వివరిస్తూ 4 పేజీల నోట్​రాసింది. సూసైడ్​నోట్​లో.. ‘గత నెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో శివ ఇంటికి వచ్చి నాపై హత్యాయత్నం చేశాడు. గొంతుకు చున్నీ బిగించాడు. స్పృహ కోల్పోవడంతో చనిపోయానని భావించి పారిపోయాడు. తర్వాత మరోసారి వాళ్ల బంధువులు రమేశ్, భిక్షం, భావ్​సింగ్​తో కలిసి నన్ను కిడ్నాప్​చేసేందుకు ప్రయత్నించారు. విషయం మా తల్లిదండ్రులకు చెప్పడంతో  మరుసటి రోజు పోలీస్​స్టేషన్​కు వెళ్తుండగా శివ అడ్డుకుని మా నాన్నపై కర్రతో దాడి చేశాడు. అంతేగాక మా నాన్నను హత్య చేయాలని కుట్ర చేశారు. గత నెల 24న ఏఎస్సైకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రూఫ్​లేదని మా నాన్నపైనే కేసు నమోదు చేశారు. తర్వాత నుంచి శివ కుటుంబసభ్యులు ప్రతిరోజు మమ్మల్ని నానా బూతులు తిడుతూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు’ అంటూ పేర్కొంది.