అందుకే ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుస్తోంది

అందుకే ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుస్తోంది

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోన్న విషయంపై బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరి స్పందించారు. సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్‌ వినియోగంపై ఇచ్చిన హామీల కారణంగానే ఆప్ గెలుస్తోందని చెప్పారు. రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తే బిల్లు చెల్లించనక్కర్లేదని ఆప్ ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ఈ ప్రకటనే ఢిల్లీ పేదలపై ప్రభావం చూపించిందని చెప్పుకొచ్చారు.

ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ కార్యకర్తలు వెనకబడిపోయారంటూ రమేశ్ బిదూరి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఢిల్లీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమ కార్యకర్తలు సమర్థవంతంగా పని చేస్తే తమ పార్టీ మంచి ఫలితాలను రాబడుతుందని, కానీ, అలా జరగని పక్షంలో కేజ్రీవాల్ పథకానికి ప్రాముఖ్యత లభిస్తుందని, అదే ఇప్పుడు జరిగిందని చెప్పారు.