
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి .. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాల నియంత్రణ విషయంలో గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను నివారించేందుకే ఇలాంటి ఆర్డినెన్స్ లను కేంద్రప్రభుత్వం తీసుకొస్తుందని ఆరోపించిన ఆప్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం (జులై 10) న అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహ ధర్మాసనం విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
ఢిల్లీలో ఉన్నతాధికారులపై కేంద్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉండేలా మోడీ సర్కార్ ఇటీవలనే ఓ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్దతను సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సవాల్ చేసింది. అంతేకాదు ఆర్డినెన్స్ ను రద్దు చేసి చేయడంతో పాటు మధ్యంతర స్టే విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఢిల్లీలో పోలీస్, శాంతి భద్రతలు, భూమి మినహా సేవల నియంత్రణను ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన వారం రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది.. దీనిపై కేజ్రీవాల్ పలు రాష్ట్రాలకు చెందిన పార్టీలతో కలిసి పోరాటం చేశాడు. గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆప్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. ఈ ఆర్డినెన్స్ ను ఇప్పటికైనా రద్దు చేయాలని సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును కోరారు.