సత్యేంద్ర జైన్‌కు బెయిల్ .. ఢిల్లీ వీడొద్దు.. మీడియాతో మాట్లాడొద్దు

 సత్యేంద్ర జైన్‌కు బెయిల్ ..  ఢిల్లీ  వీడొద్దు.. మీడియాతో మాట్లాడొద్దు

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు 6 వారాల పాటు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అనుమతి లేకుండా ఢిల్లీని వదిలి వెళ్లరాదని,  మీడియా ముందు ఎలాంటి కామెంట్స్  చేయెద్దని సూచించింది.  ఆరోగ్య కారణాల రీత్యా సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

కోర్టు ఈ ఉత్తర్వులు 2023 జూలై 11 వరకు అమలులో ఉంటాయి. జులై 10న కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. ఈలోగా చేయబోయే ట్రీట్ మెంట్ రిపోర్టును కోర్టుకు అందజేయాల్సి ఉంటుంది.  తీహార్ జైలులో ఉన్న సత్యేందర్ జైన్ 2023 మే 25  గురువారం రోజున బాత్‌రూమ్‌లో కళ్లు తిరిగి కింద పడిపోయారు.  దీంతో ఆయన్ను వెంటనే  దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేర్చారు. 

తీహార్ జైలు డీజీ తెలిపిన వివరాల ప్రకారం..   జైలు ఆవరణలోని సెల్ నంబర్ 7లో ఉన్న సత్యేందర్  ఉదయం 6 గంటలకు వాష్‌రూమ్‌లో పడిపోయారని తెలిపారు .  దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించామని, అక్కడ అతనికి పలు వైద్య పరీక్షలు నిర్వహింస్తున్నట్లుగా తెలిపారు.

సత్యేందర్ జైన్‌కు వెన్నెముకకు శస్త్ర చికిత్స జరగాల్సి ఉందని డీజీ తెలిపారు. మనీలాండరింగ్ కేసులో జైన్‌ను గతేడాది మేలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసినప్పటి నుంచి తీహార్ జైలులో ఉంచారు.