
- 18 మంది రైతులను మోసం చేసిన కాంట్రాక్టర్, అధికారులు
- గొర్రెలు విక్రయించిన రైతుల స్టేట్మెంట్లు రికార్డ్
- శనివారం 8 మంది రైతులను విచారించిన ఏసీబీ
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ గొర్రెల పంపిణీ స్కీమ్ స్కామ్లో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రూ.2.08 కోట్లు గోల్మాల్ చేసిన కాంట్రాక్టర్, పశు సంవర్ధక శాఖ అధికారుల గుట్టు విప్పుతున్నది. ఇందులో భాగంగా గొర్రెలు విక్రయించిన పల్నాడు జిల్లాకు చెందిన 8 మంది రైతుల స్టేట్మెంట్లను శనివారం రికార్డు చేసింది. బంజారా హిల్స్లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్లో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సమాచారం సేకరించారు.
గొర్రెల కొనుగోళ్లలో 18 మంది రైతులకు చెల్లించాల్సిన రూ.2.08 కోట్లను కాంట్రాక్టర్, పశు సంవర్ధక శాఖ అధికారులు కలిసి బినామీ అకౌంట్స్కు మళ్లించిన సంగతి తెలిసిందే. బాధిత రైతుల ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు గత డిసెంబర్లో కేసు నమోదు చేశారు. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సమగ్ర దర్యాప్తు కోసం కేసును ఏసీబీకి అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. బాధిత రైతుల నుంచి ఆధారాలు సేకరిస్తున్నది. స్కామ్ జరిగిన విధానాన్ని బాధిత రైతులు ఏసీబీకి వివరించారు.2017 నుంచే ప్రభుత్వానికి గొర్రెలు విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు.
బినామీ అకౌంట్స్తో రూ.2.08 కోట్లు కొట్టేశారు
నిరుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో గొర్రెలు సప్లయ్ చేశామని రైతులు వెల్లడించారు. ఎన్నికల కోడ్ను చూపుతూ తమకు రావాల్సిన డబ్బును చెల్లించలేదని చెప్పారు. బినామీ అకౌంట్లలోకి డబ్బులు డిపాజిట్ చేసి డ్రా చేసుకున్నారని తెలిపారు. ఈ స్కీమ్లో పంపిణీ చేసేందుకు అవసరమైన గొర్రెపిల్లలను కొనుగోలు చేసేందుకు కొండాపూర్లోని లోలోనా ది లైవ్ కంపెనీకి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది.
కాంట్రాక్టర్ సయ్యద్ మొయిద్, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి కలిసి ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 18 మంది రైతుల వద్ద133 యూనిట్ల గొర్రెపిల్లలను కొనుగోలు చేశారు. వాటిని విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన రూ.2.08 కోట్లను చెల్లించలేదు. ఈ డబ్బును విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లోని బినామీ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఈ మోసంపై బాధిత రైతులు గత డిసెంబర్లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొయిద్తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవ సాయిలపై కేసు నమోదు చేశారు.