పైసలుంటేనే రిజిస్ట్రేషన్లు, కన్వర్షన్లు

పైసలుంటేనే రిజిస్ట్రేషన్లు, కన్వర్షన్లు
  • తహసీల్దార్​ రజనీపై గతంలోనూ ఆరోపణలు
  • మెండుగా  బీఆర్​ఎస్ లీడర్ల సపోర్ట్  
  • సాదాబైనామా క్రమబద్ధీకరణ సమయంలో వీఆర్వో సూసైడ్​

హనుమకొండ, ధర్మసాగర్​, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో పని చేసిన ఎమ్మార్వో రజనీరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆమె పని చేస్తున్న జమ్మికుంట తహసీల్దార్​ ఆఫీస్​ తో పాటు గతంలో ఇక్కడ వర్క్​ చేసిన కార్యాలయాల్లోనూ బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా తనిఖీల అనంతరం వివిధ ల్యాండ్​ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఇదిలాఉంటే అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న  రజనీరెడ్డిపై ఉమ్మడి జిల్లాలో గతంలోనూ ఆరోపణలు వెల్లువెత్తాయి. బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ఓ ప్రజాప్రతినిధి సపోర్ట్ ఉండటం వల్లే ఎమ్మార్వో రజనిపై యాక్షన్​ తీసుకోలేదనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఏ పని కావాలన్నా డబ్బులే... 

ధర్మసాగర్​ తహసీల్దార్​ గా పని చేసిన సమయంలో రజనీరెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. వరంగల్ శివారులోని రింగ్​ రోడ్డు ఈ మండల పరిధిలోనే ఎక్కువగా ఉండగా.. ఆ ఏరియాలో  రిజిస్ట్రేషన్లు కావాలన్నా, నాలా కన్వర్షన్లు చేయాలన్నా ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వచ్చేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా రిజిస్ట్రేషన్లు, నాలా కన్వర్షన్లు చేయించే క్రమంలో నేరుగా తన పేరు బయటపడకుండా ఆఫీస్​ లో పని చేసే సిబ్బంది సహాయంతో డబ్బులు వసూళ్లకు పాల్పడేదని తెలిసింది. డబ్బులు ముట్టేంత వరకు రిజిస్ట్రేషన్​ చేయకపోగా.. చేతిలో నగదు లేకుంటే అక్కడున్న సిబ్బంది ఫోన్​ పే ద్వారా కూడా వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.

ఆఫీస్​ లో ఏ పని కావాలన్నా ఎంతోకొంత ముట్టజెప్పాల్సిందేనని, లేదంటే సాకులు చెబుతూ ఇబ్బందులకు గురి చేసేవారనే కొంతమంది ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా ధర్మసాగర్​ మండలంలోని కొన్ని  ప్రభుత్వ భూములు, లిటిగేషన్​ ల్యాండ్స్​ కు కూడా బై నెంబర్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. కొన్ని ల్యాండ్స్​ కు పదంకెల వరకు బై నెంబర్స్ ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు  అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేగాకుండా రింగ్​ రోడ్డు సమీపంలో తన కుటుంబ సభ్యుల 
పేరున కూడా ల్యాండ్స్ కూడబెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

వీఆర్వో సూసైడ్​ విషయంలో ఆరోపణలు

తహసీల్దార్​ రజని 2015 నుంచి 2017 వరకు శాయంపేట మండలంలో విధులు నిర్వర్తించగా.. ఆమె అక్కడి నుంచి ట్రాన్స్​ ఫర్​ అయిన కొద్దిరోజులకే ఓ వీఆర్వో ఆత్మహత్య చేసుకున్నాడు. దామెర మండలంలోని కోగిల్వాయి గ్రామానికి చెందిన గోల్కొండ మహేందర్​.. శాయంపేట మండలంలోని మాందారిపేట వీఆర్వోగా పని చేయగా.. సాదాబైనామా భూములను క్రమబద్ధీకరించేందుకు రైతుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడు.

ఆ తరువాత కొద్దిరోజులకే తహసీల్దార్​ రజనీ అక్కడి నుంచి బదిలీ కాగా సాదాబైనామా దరఖాస్తులు క్రమబద్ధీకరణకు నోచుకోలేదు. దీంతో డబ్బులు ఇచ్చిన రైతుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో కమలాపూర్​ మండలంలోని మాదన్నపేట సమీపంలో వీఆర్వో మహేందర్​ సూసైడ్​ చేసుకున్నాడు. కాగా తహసీల్దార్​ రజనీ సూచన మేరకే డబ్బు వసూలు చేసి, ఆమెకు అప్పగించాడని, ఆ తరువాత డబ్బులు తీసుకున్న అధికారిణి భూములను క్రమబద్ధీకరించకపోవడం, రైతుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడం  వల్లే మహేందర్​ సూసైడ్​ చేసుకోవాల్సి వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.

బినామీల పేరుతో భూములు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో శాయంపేట, వేలేరు, ధర్మసాగర్​ తదితర చోట్ల తహసీల్దార్​ రజనీ పని చేయగా..  గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయంలో ఆమెపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.  ధర్మసాగర్ మండల కేంద్రంలో1,104 సర్వే నెంబర్​లో  18 ఎకరాల 36 గుంటల అసైన్డ్​ భూమి ఉండగా.. అందులో ఎకరం భూమిని రియల్​ ఎస్టేట్​ వ్యాపారులతో కలిసి బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.

 ఓ ప్రజాప్రతినిధి దగ్గరి బంధువు కావడం, జిల్లాకు చెందిన కొందరు అధికారుల సపోర్టు వల్లే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాదనలు వినిపించాయి. కాగా ఇటీవల ఏసీబీకి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు జరుపుతుండటంతో ఆయా మండలాల్లోని సిబ్బంది, రియల్​ ఎస్టేట్​ వ్యాపారుల్లో కూడా  కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఏసీబీ అధికారులు కూపీ లాగుతుండగా.. విచారణలో ఎలాంటి వాస్తవాలు బయటపడతాయో చూడాలి.