మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా పశుసంవర్ధక శాఖలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆ శాఖ ఏడీ శంకర్ నివాసంతో పాటు కలెక్టరేట్లోని ఆఫీస్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో 10 గంటలకే రాంనగర్లోని శంకర్ ఇంట్లో సోదాలు ప్రారంభించారు. అప్పటికీ ఆయన ఇంట్లోనే ఉన్నారు. 11.30 గంటలకు మరికొందరు ఆఫీసర్లు కలెక్టరేట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న జిల్లా వెటర్నరీ, యానిమల్ హజ్బెండరీ ఆఫీసులో తనిఖీలు చేపట్టారు.
ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీటింగ్కు జిల్లాలోని వెటర్నరీ డాక్టర్లంతా హాజరుకాగా, వారిని రాత్రి వరకు లోపలే ఉంచి విచారించారు. డిపార్ట్మెంటల్ తనిఖీల్లో భాగంగానే పశుసంవర్ధక శాఖ ఆఫీస్తో పాటు ఏడీ శంకర్ నివాసంలో సోదాలు నిర్వహించామని డీఎస్పీ మధు తెలిపారు. శంకర్ ఇంట్లో నాలుగు ఫారిన్ లిక్కర్ బాటిల్స్ సహా ఖరీదైన 42 మద్యం బాటిళ్లు లభించగా, ఎంక్వైరీ కోసం ఎక్సైజ్ అధికారులకు అప్పగించామని తెలిపారు.
రాత్రి 9 గంటల వరకూ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, శంకర్ నివాసంలో భారీగా బంగారం, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమైనట్టు తెలిసింది. ఇదిలాఉంటే జిల్లాలో పాతుకుపోయిన శంకర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల జిల్లాలోని వెటర్నరీ డాక్టర్లకు పెండింగ్ బిల్స్ రిలీజ్ కాగా, అందులో 16 శాతం, ట్రాన్స్పోర్ట్ బిల్లులో 25 పర్సెంట్ కమీషన్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో శంకర్ అవినీతిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో సోదాలు నిర్వహించారని చర్చించుకుంటున్నారు.
