
అల్వాల్ వెలుగు: మహిళను బెదిరించి లైంగికదాడి పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ అయ్యారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు. కుటుంబ గొడవల కారణంగా ఓ మహిళ ఈనెల12న అల్వాల్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో ఆటోలో ఇంటికి వెళ్తూ.. తినేందుకు లోతుకుంటలో ఆపింది. అక్కడ మద్యం తాగిన సాయికిరణ్, సలీం వచ్చి ఆటో ఎక్కారు. వారు మహిళను బెదిరించి సికింద్రాబాద్, సుచిత్ర, అల్వాల్ ప్రాంతాల్లో ఆటోలో తిప్పి లోతుకుంటలోని గణేశ్ఆలయం సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి ఆటో దిగారు.
మహిళపై సాయికిరణ్ లైంగికదాడి చేయగా.. అతనికి సలీం సహకరించాడు. వారి నుంచి ఆమె తప్పించుకొని డయల్100 కు కాల్ చేసి చెప్పగా.. బొల్లారం పోలీసులు వెంటనే ఆమె వద్దకు వెళ్లి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అల్వాల్ పీఎస్ కు ట్రాన్స్ ఫర్ చేయగా బాధిత మహిళ నుంచి ఘటన వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, అల్వాల్ సీఐ రాహుల్ దేవ్ పర్యవేక్షణలో ఎస్వోటీ, సీసీఎస్ పోలీసు టీమ్ లు సీసీ పుటేజ్ లను పరిశీలించారు.
నిందితులు సాయికిరణ్, సలీంల ఫోన్లను ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. ఆటో డ్రైవర్ శంకర్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని డీసీపీ తెలిపారు. రెండు రోజుల్లో కేసు ఛేదించి నిందితులను అరెస్టు చేసిన పోలీసులను సైబరాబాద్ సీపీ అభినందించి రివార్డులను ప్రకటించారు.