పేషెంట్ల ప్రాణాలపై నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటాం :  వెంకటేశ్వరరావు

పేషెంట్ల ప్రాణాలపై నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటాం :  వెంకటేశ్వరరావు

షాద్ నగర్, వెలుగు: ప్రైవేట్ఆస్పత్రులు అర్హులైన డాక్టర్లను నియమించుకుని వైద్యసేవలను అందించాలని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు స్పష్టంచేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి రోగుల ప్రాణాలు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం షాద్ నగర్ టౌన్ లోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మేనేజ్ మెంట్లపై సీరియస్ అయ్యారు. వైద్యులతో మాట్లాడి ఓపీ, డెలివరీ, ఆపరేషన్ రిజిస్టర్లను పరిశీలించారు. ఏబీవీ హాస్పిటల్ లో లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ ను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కొంతకాలంగా ఏబీవీ, బుగ్గారెడ్డి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం వికటించి పేషెంట్లు మృతి చెందుతుండగా బాధిత కుటుంబాలు న్యాయం చేయాలని ఆందోళనకు దిగుతున్నది తెలిసిందే. డిప్యూటీ డీఎం,హెచ్ఓ విజయలక్ష్మి, జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ శ్రీనివాస్,హెల్త్ ఎడ్యుకేషన్ శ్రీనివాసులు ఉన్నారు.