పార్టీ నిర్ణయమే శిరోధార్యం : నాగురావు నామాజీ

పార్టీ నిర్ణయమే శిరోధార్యం : నాగురావు నామాజీ
  • పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు పనిచేయాలి 
  • బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత నాగురావు నామాజీ

నారాయణపేట, వెలుగు : క్రమశిక్షణ కలిగిన బీజేపీలో పార్టీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్  నేత నాగురావు నామాజీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. శుక్రవారం నారాయణపేటలో బీజేపీ అభ్యర్థి కె.రతంగ్ పాండురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో నామాజీ మాట్లాడారు. ప్రతిఒక్క కార్యకర్త కూడా తామే అభ్యర్థులుగా భావించికొని కష్టపడితే బీజేపీ గెలుపును ఏ శక్తీ ఆపలేదన్నారు. కుటంబ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ఓడించి బీజేపీని అధికారంలోకి తేవడానికి ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పారు. 

ప్రజలను మోసం చేయడంలో ఆ రెండు పార్టీల నేతలు పోటీ పడుతున్నారని ఆయన విమర్శించారు. పథకాలు అమలు చేయకుండా, హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్  మోసం చేస్తే, కర్నాటకలో ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా ఆ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్  నేతలు మోసం చేస్తున్నారని ఆయన ఫైర్  అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ప్రతి బూత్ ను బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆయన  పిలుపునిచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్ , సీనియర్ నాయకులు వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.