గద్వాల, వెలుగు: యాసంగి క్రాప్ బుకింగ్ లో స్టేట్ లోనే జోగులాంబ గద్వాల జిల్లా మూడో ప్లేస్ లో ఉందని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. యాసంగి సీజన్లో జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 1,73,707 ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లు గుర్తించామన్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు 1,64,603 ఎకరాలకు క్రాప్ బుకింగ్ పూర్తి కాగా, 94.76 శాతం నమోదు సాధించి రాష్ట్రస్థాయిలో జిల్లా మూడవ స్థానంలో నిలిచిందన్నారు. ఈనెల 30న ముగియనున్న నమోదు ప్రక్రియ వేగవంతం చేసి వంద శాంతం కంప్లీట్ చేయాలని ఆఫీసర్లకు సూచించారు.
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి
యాదాద్రి, వెలుగు : మెనూ ప్రకారం స్టూడెంట్స్కు నాణ్యమైన భోజనం పెట్టాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం మోత్కూరులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ సందర్శించారు. టీచర్లు బోధించే విధానాన్ని స్టూడెంట్స్ను ఆయన అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్స్, టీచర్ల సంఖ్యతో పాటు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? లేదో ఆరా తీశారు. కిచెన్కు వెళ్లి వంట సామగ్రి నాణ్యతను పరిశీలించారు. అనంతరం స్టూడెంట్స్తో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.
వీధి కుక్కలను నియంత్రించాలి
వీధి కుక్కలను నియంత్రించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. కుక్కల నియంత్రణపై నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కుక్కల సంఖ్య పెరగకుండా స్టెరిలైజేషన్ చేయాలని ఆదేశించారు.
