
హైదరాబాద్: సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఈడీ ముందుకు హీరో మహేష్ బాబు హాజరు కావాల్సిన సమయం రానే వచ్చింది. నేడు (సోమవారం) తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఇప్పటికే మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 28నే విచారణకు హాజరు కావలసిందిగా ఈడీ మొదట నోటీసులు ఇచ్చింది. షూటింగ్ కారణంగా హాజరు కాలేనని.. మరో తేదీన హాజరవుతానని మహేష్ బాబును ఈడీని అభ్యర్థించాడు.
మహేశ్ రిక్వెస్ట్ను పరిగణనలోకి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మే 12న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరవుతాడా..? లేదా..? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. సాయి సూర్య డెవలపర్స్కు మహేష్ బాబు బ్రాండ్ ప్రమోషన్ చేశాడు. ఇందుకు గానూ.. మహేష్ బాబు మొత్తం రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 3.4 కోట్లు నగదు రూపంలో, రూ. 2.5 కోట్లు RTGS ద్వారా తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ లావాదేవీలపై విచారించేందుకే మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
సాయి సూర్య డెవలపర్స్ కేసు ఏంటంటే..
సాయి సూర్య డెవలపర్స్ వెంచర్లను ప్రమోట్ చేసినందుకు నటుడు మహేశ్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ మేరకు ఆయనకు సమన్లు పంపింది. పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్బుక్స్ తీసుకురావాలని సూచించింది. పెట్టుబడిదారులను సాయిసూర్య డెవలపర్స్ మోసం చేసిన విషయం తెలిసిందే. దాదాపు రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
►ALSO READ | Tamil Hero Vishal: వేదిక పైనే స్పృహ తప్పి పడిపోయిన సినీ నటుడు విశాల్.. వీడియో వైరల్
దర్యాప్తులో భాగంగా సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఈనెల 16న ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించింది. రూ.74.5 లక్షలు నగదు సీజ్ చేసింది. మహేశ్బాబుకు చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్ల చెల్లింపులు చేసినట్లు ఆధారాలు సేకరించింది. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సాయితులసి ఎన్క్లేవ్, షణ్ముక నివాస్ పేరుతో సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ వెంచర్లను ఏర్పాటు చేశాయి. ప్రధానంగా సాయిసూర్య డెవలపర్స్ ఒక్కో ప్లాట్కు రూ.3.25 కోట్ల చొప్పున కస్టమర్లతో అగ్రిమెంట్లు చేసుకుంది. అడ్వాన్స్గా రూ.1.45 కోట్లు వసూలు చేసింది.
ఒకరికి విక్రయించిన ప్లాట్ను పలువురి పేర్లపై రిజిస్టర్ చేసి వందల కోట్లు మేర ఇన్వెస్టర్లను మోసం చేసింది. ఇలా సంపాదించిన డబ్బును ఇతర సంస్థలకు మళ్లించింది. ఈ క్రమంలోనే నటుడు మహేశ్బాబుకు రూ.5.9 కోట్లు సాయిసూర్య డెవలపర్స్ నుంచి చెల్లింపులు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు రాబడుతున్నారు. కాగా, సాయితులసి ఎన్క్లేవ్, షణ్ముక నివాస్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు నవంబర్లో సైబరాబాద్ ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు మొత్తం 11 కేసులు రిజిస్టర్ చేశారు.