- అదానీ దెబ్బకు అయోమయంలో ఎన్డీటీవీ
- మెజార్టీ వాటాను దక్కించుకోవడంపైనే అదానీ గ్రూప్ ఫోకస్
- గతంలోనూ సక్సెస్ఫుల్గా జరిగిన హాస్టైల్ టేకోవర్స్
బిజినెస్ డెస్క్, వెలుగు: న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ) లో 29.18 శాతం వాటాను దక్కించుకున్నామని గౌతమ్ అదానీ గ్రూప్ ప్రకటించిన తర్వాత నుంచి ‘హాస్టైల్ (బలవంతంగా) టేకోవర్’ బాగా పాపులర్ అవుతోంది. గతంలోనూ చాలా కంపెనీలు హాస్టైల్ టేకోవర్ చేపట్టాయి. రాశీ సిమెంట్స్ను ఇండియా సిమెంట్స్, మైండ్ట్రీని ఎల్ అండ్ టీ సక్సెస్ఫుల్గా హాస్టైల్ టేకోవర్ చేయడాన్ని చూశాం. హాస్టైల్ టేకోవర్ అంటే ఏదైనా కంపెనీలో మెజార్టీ వాటాను ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఒప్పుకోకపోయినా దక్కించుకోవడమని అర్థం. అదానీ గ్రూప్ ఇప్పటికే ఎన్డీటీవీలో 29.18 శాతం దక్కించుకుంది. మరో 26 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ ( ప్రమోటర్లు కాకుండా ఇతర షేరు హోల్డర్ల నుంచి కొనడం) ను ప్రకటిస్తామని పేర్కొంది. ఇదే జరిగితే ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 55.18 శాతానికి పెరుగుతుంది. ప్రస్తుతం ఎన్డీటీవీలో ప్రమోటర్లు అయిన రాధిక రాయ్, ప్రణయ్ రాయ్లకు కలిపి 32.27 శాతం వాటా ఉంది. యాంటీ మోడీగా పేరొందిన ఎన్డీటీవీలోకి అదానీ ఎంట్రీ ఈ కంపెనీ ప్రమోటర్లను, ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పొచ్చు.
హాస్టైల్ టేకోవర్ అంటే..
ఉదాహరణకు ‘ఏ’ అనే కంపెనీ ‘బీ’ అనే మరో కంపెనీని కొనాలని చూస్తోందని అనుకుందాం. ఈ ఆఫర్ను బీ మేనేజ్మెంట్ తిరస్కరించినా, ఏ అనే కంపెనీ టెండర్ ఆఫర్, ప్రాక్సీ ఓటు లేదా పెద్ద మొత్తంలో షేర్లు కొనడం వంటి మార్గాల్లో బీ కంపెనీని టేకోవర్ చేయడాన్ని హాస్టైల్ టేకోవర్ అంటారు. టెండర్ ఆఫర్ అంటే మార్కెట్లోని ధర కంటే ఎక్కువ ధరకు కంపెనీని షేరు హోల్డర్ల నుంచి కొనుగోలు చేయడం. ప్రాక్సీ ఓటు అంటే బీ కంపెనీ షేరు హోల్డర్లతో ఓటు వేయించి ఈ కంపెనీ మేనేజ్మెంట్ను మార్చేలా చేయడం. తర్వాత బీ కంపెనీని టేకోవర్ చేయడం. ఎన్డీటీవీ విషయంలో అదానీ గ్రూప్ పెద్ద మొత్తంలో షేర్లను కొనుగోలు చేసే మార్గాన్ని ఎంచుకుంది.
సెబీ రూల్స్ అడ్డురావు..
ఎన్డీటీవీ చేసిన సెబీ రిస్ట్రిక్షన్ల ప్రకటనపై అదానీ గ్రూప్ స్పందించింది. ఈ కంపెనీ ప్రమోటర్ల ఇన్వెస్ట్మెంట్ కంపెనీపై సెబీ రిస్ట్రిక్షన్లు వర్తించవని పేర్కొంది. కాగా, రాధిక రాయ్ ప్రణయ్ రాయ్ (ఆర్ఆర్పీఆర్) ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఎన్డీటీవీలో వాటాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రమోటర్లు అయిన ప్రణయ్ రాయ్, రాధిక రాయ్లపై కంపెనీ షేర్లను కొనడంపైన, అమ్మడంపైన 2020 నుంచి సెబీ రిస్ట్రిక్షన్లు ఉన్నాయని, దీంతో అదానీ గ్రూప్కు షేర్లను బదిలీ చేయడానికి అవ్వదని ఎన్డీటీవీ ప్రకటించింది. ఎన్డీటీవీ ఫౌండర్ల వాదన అర్థంపర్దం లేనిదని అదానీ గ్రూప్ పేర్కొంది.
రిలయన్స్ కొందామని అనుకున్నా..
ఎన్డీటీవీని దక్కించుకోవాలని గత 13 ఏళ్ల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తున్నా చివరిలో అదానీ గ్రూప్ దక్కించుకోవడం విశేషం. తాజాగా ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీపీఎల్) ద్వారా అదానీ గ్రూప్ దక్కించుకుంది. ఎన్డీటీవీలో వాటా ఉన్న ‘రాధిక రాయ్ ప్రణయ్ రాయ్ కంపెనీ (ఆర్ఆర్పీఆర్)’ కి వీసీపీఎల్ 2009 లో రూ. 400 కోట్లు అప్పుగా ఇచ్చింది. ఈ అప్పును ఎప్పుడైనా కంపెనీలో ఈక్విటీగా మార్చుకునే అవకాశం వీసీపీఎల్కు దక్కింది. తాజాగా వీసీపీఎల్లో 100 శాతం వాటాను కొన్న అదానీ గ్రూప్, ఈ అప్పును ఎన్డీటీవీలో ఈక్విటీగా మార్చుకుంది.
మొదటిలో వీసీపీఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్కు ఫుల్లీ సబ్సిడరీ అయిన షినో రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్కు సబ్సిడరీ. ఈ టైమ్లో వీసీపీఎల్ డైరెక్టర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్లుగా పనిచేశారు కూడా. కానీ, 2012 లో వీసీపీఎల్ ఓనర్షిప్లో మార్పులు జరిగాయి. నెక్స్ట్వేవ్ టెలీవెంచర్, స్కైబ్లూ బిల్డివెల్ ప్రైవేట్ లిమిటెడ్లో వీసీపీఎల్ను షినో రిటైల్ నుంచి దక్కించుకున్నాయి. ఈ కంపెనీలకు సంబంధం ఉన్న మహేంద్రా నహతా ఈ టైమ్లో రిలయన్స్ జియోలో డైరెక్టర్గా పనిచేశారు కూడా. కానీ, రిలయన్స్ కంటే ముందే అదానీ గ్రూప్ ఎన్డీటీవీలో వీపీసీఎల్ షేర్లను దక్కించుకోవడం గమనించాలి.