న్యూఢిల్లీ: స్విస్ సంస్థ హోల్సిమ్ లిస్టెడ్ కంపెనీలు ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ పబ్లిక్ షేర్హోల్డర్ల నుండి 26 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్ రూ. 31 వేల కోట్ల ఓపెన్ ఆఫర్ను శుక్రవారం ప్రారంభించింది. ఈ ఏడాది మే నెలలో అదానీ గ్రూప్ భారతదేశంలోని హోల్సిమ్ లిమిటెడ్ వ్యాపారాలలో కంట్రోలింగ్ స్టేక్ కొనుగోలు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 10.5 బిలియన్ డాలర్లని వెల్లడించింది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ పోయిన వారం ఈ ఓపెన్ ఆఫర్కు ఆమోదం తెలిపింది. పూర్తిగా సబ్స్క్రయిబ్ అయినట్లయితే ఓపెన్ ఆఫర్ విలువ రూ.31 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
అదానీ ఫ్యామిలీ గ్రూప్, మారిషస్ ఆధారిత సంస్థ ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించిన ఓపెన్ ఆఫర్ కోసం రెండు వేర్వేరు రెగ్యులేటరీ ఫైలింగ్లలో అంబుజా సిమెంట్స్, ఏసీసీ తమ ఆఫర్ లెటర్లను అందజేశాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, డాయిష్ ఈక్విటీస్ ఇండియా మేనేజర్లు ఓపెన్ ఆఫర్కు సమర్పించిన కొత్త షెడ్యూల్ ప్రకారం, షేర్ల టెండరింగ్ ఆగస్టు 26 నుండి ప్రారంభమై, సెప్టెంబర్ 9న ముగుస్తుంది. ఈ ఏడాది మే నెలలో అంబుజా సిమెంట్స్కు షేరుకు రూ.385 చొప్పున, ఏసీసీ షేరుకు రూ.2,300 చొప్పున అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. అంబుజా సిమెంట్స్లో 51.63 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను పొందేందుకు పబ్లిక్ షేర్హోల్డర్లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.
ఇది ఎక్స్పాండెడ్ షేర్ క్యాపిటల్లో 26 శాతానికి సమానం.. అంటే రూ. 19,879.57 కోట్లు. ఏసీసీ లిమిటెడ్ గ్రూప్ పబ్లిక్ షేర్హోల్డర్ల దగ్గరున్న 4.89 కోట్ల షేర్లు ఎక్స్పాండెడ్ షేర్ క్యాపిటల్లో 26 శాతానికి సమానం. వీటిని రూ. 11,259.97 కోట్ల వరకు కొనుగోలు చేసేందుకు ఆఫర్ ఇచ్చింది.ఏసీసీ లిమిటెడ్ షేర్లు శుక్రవారం సెషన్లో కొద్దిగా పెరిగి రూ. 2286 వద్ద ముగిశాయి. అంబుజా సిమెంట్స్ షేరు 1.49 శాతం లాభపడి రూ.403 వద్ద క్లోజయ్యింది. ఇదిలా ఉంటే, ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అక్రోపోలిస్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ను అదానీ కుటుంబానికి చెందిన కొంతమంది సభ్యులు నిర్వహిస్తారు.
ఈ ఏడాది మే 15న కుదిరిన ఒప్పందం ప్రకారం అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్స్లో 63.1 శాతాన్ని అదానీ గ్రూప్కు దక్కుతుంది. అంబుజా లోకల్ సబ్సిడరీల్లో ఏసీసీ లిమిటెడ్ కూడా ఉంది. హోల్సిమ్కు అంబుజా సిమెంట్స్లో 63.19 శాతం, ఏసీసీలో 54.53 శాతం (దీనిలో 50.05 శాతం అంబుజా సిమెంట్స్ ద్వారా నిర్వహిస్తారు). అంబుజా సిమెంట్స్, ఏసీసీలకు సంవత్సరానికి 70 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది. రెండు కంపెనీలకు కలిపి 23 సిమెంట్ ప్లాంట్లు, 14 గ్రైండింగ్ స్టేషన్లు, 80 రెడీ-మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లతోపాటు ఇండియాలో 50వేలకుపైగా ఛానెల్ పార్ట్నర్లు ఉన్నారు.