
- రెండున్నర లక్షలు దాటిన కొత్త ప్రవేశాలు
- ఫస్ట్ క్లాస్లో లక్షకు పైనే చేరికలు
- ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లోకి 48,133 మంది
- 10 జిల్లాల్లో పదివేలకు పైగానే కొత్త అడ్మిషన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అడ్మిషన్లు ఊపందకున్నాయి. గవర్నమెంట్ స్కూళ్ల వైపు పేరెంట్స్ మొగ్గు చూపుతుండటంతో ఈసారి రికార్డు స్థాయిలో అడ్మిషన్స్ అవుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం ఇప్పటివరకూ ప్రభుత్వ బడుల్లో రెండున్నర లక్షల మంది కొత్తగా చేరారు. దీంట్లో సుమారు 50 వేల మంది వరకూ ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లో చేరిన వారే కావడం విశేషం. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపు కోసం విద్యాశాఖ అధికారులు ఈ నెల 6 నుంచి 19 వరకూ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో సర్కారు బడులపై నమ్మకం పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనికి టీచర్ల సంఘాలూ తోడయ్యాయి. దీంతో సర్కారు బడుల్లో అడ్మిషన్ల జోరు కొనసాగుతున్నది.
2,56,156 కొత్త అడ్మిషన్లు
వేసవి సెలవులు పూర్తికావడంతో ఈ నెల 12న బడులు రీఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,56,156 కొత్త అడ్మిషన్లు వచ్చాయి. దీంట్లో ఒకటో తరగతిలో 1,07,126 మంది చేరగా, రెండో తరగతి నుంచి పదో తరగతి వరకూ 1,49,030 మంది ప్రవేశాలు పొందారు. దీంట్లో కొత్తగా నిరుడు రిక్రూట్ అయిన పదివేల మంది టీచర్ల పాత్ర కీలకంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే, సరిగ్గా నిరుడు జూన్ 24 వరకూ కొత్త అడ్మిషన్లు 2,00,901 ఉండగా, ఈసారి 2.56 లక్షలకు పెరగడం విశేషం. నిరుడితో పోలిస్తే ఏకంగా 55 వేలకు పైగా కొత్త అడ్మిషన్లు పెరిగాయి.
ప్రైవేటు నుంచి సర్కారుకు..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు సర్కారు బడులపై పేరెంట్స్ ను ఆకర్షించేలా చేశాయి. దీంట్లో ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు బుక్లు, యూనిఫామ్, వర్క్ బుక్లు అందించడం ఒకటైతే, అమ్మ ఆదర్మ పాఠశాలల కమిటీల ఏర్పాటు మరొకటి. దీంతో ఈ విద్యాసంవత్సరం ఇప్పటి వరకూ 48,133 మంది ప్రైవేటు స్కూళ్ల నుంచి గవర్నమెంట్ బడుల్లో చేరారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారం కూడా సర్కారు వైపు ఆలోచించేలా చేస్తున్నది. అయితే, దీంట్లో 10 శాతం అడ్మిషన్లు అంటే 5 వేలకు పైగా హైదరాబాద్ జిల్లాలో ఉన్నాయి. మరోపక్క సర్కారు నుంచి సర్కారు బడుల్లోకి1,00,897 మంది విద్యార్థులు చేరారు. వీరిలో ఐదో తరగతి నుంచి ఆరులో చేరిన వారే ఎక్కువగా ఉన్నారు.
పట్నంలోనే టాప్
సర్కారు బడుల్లో పది జిల్లాల్లో పదివేలకు పైగానే కొత్త అడ్మిషన్లు వచ్చాయి. దీంట్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 19,555 అడ్మిషన్లు కాగా, అత్యల్పంగా హనుమకొండ జిల్లాలో 1,386 వచ్చాయి. అయితే, జులై, ఆగస్టు నెలల్లోనూ అడ్మిషన్లు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలే.. ప్రభుత్వ బడుల వైపు పేరెంట్స్ దృష్టి పడేందుకు కారణమని అంటున్నారు. ఈ ఏడాది 3 లక్షలకు పైగా అడ్మిషన్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.