V6 News

గూండాలు రాజ్యమేలుతున్నరు

గూండాలు రాజ్యమేలుతున్నరు

లాయర్లకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంది?
వామన్​రావు దంపతుల హత్య వెనుక ఎవరున్నా శిక్షించాల్సిందే
కేసును సీబీఐతో ఎంక్వైరీ చేయించాలి.. సీఎం స్పందించాలి: అడ్వకేట్లు
బీజేపీ లీగల్​ సెల్​ ఆధ్వర్యంలో ‘చలో గుంజపడుగు’

పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలో రాక్షస రాజ్యం కొనసాగుతోందని, న్యాయాన్ని కాపాడే తమకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని లాయర్లు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే సీఎం ఫాంహౌస్​కు పరిమితమయ్యారని, గూండాలు రాజరికం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్​ దంపతులు వామన్​రావు, నాగమణి హత్యల వెనుక ఎవరున్నా శిక్షించాల్సిందేనని, కేసును సీబీఐకి అప్పగించాల్సిందేనని డిమాండ్​ చేశారు. వామన్​రావు, నాగమణి కుటుంబాన్ని పరామర్శించడానికి బీజేపీ లీగల్​ సెల్​ ఆధ్వర్యంలో ఆదివారం ‘చలో గుంజపడుగు’ చేపట్టారు. హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని వివిధ కోర్టుల నుంచి సుమారు 200 మంది లాయర్లు ఇందులో పాల్గొన్నారు. మొదట వారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  రామగిరి మండలంలోని కల్వచర్ల వద్ద వామన్​ రావు దంపతుల హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

అక్కడి నుంచి మంథని చేరుకొని అంబేద్కర్​ విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. ఆ తర్వాత వామన్​రావు సొంతూరు గుంజపడుగుకు చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీజేపీ లీగల్​సెల్​ రాష్ట్ర కన్వీనర్​ విశ్వనాథ్​ మాట్లాడుతూ.. లాయర్​ దంపతులను  నడి రోడ్డుపై హత్య చేశారంటే రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ ఎలాంటి పరిస్థితిలోకి చేరిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వామన్​ రావు,  నాగమణి దంపతుల కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు రాష్ట్రంలోని లాయర్లకు భరోసా కల్పించడానికే తాము ఈ యాత్ర చేపట్టామని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపించే సీఎం ఫాంహౌస్​లో ఉంటే.. గూండాలు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్​ స్పందించి హత్యల వెనుక ఉన్న బడాబాబులకు శిక్షపడేలా చూడాలని డిమాండ్​ చేశారు.  హైకోర్ట్ బార్ కౌన్సిల్ మెంబర్​ ప్రసన్న మాట్లాడుతూ రాష్ట్రంలో  రాక్షస రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. రామగుండం పోలీస్​ కమిషనర్​ సత్యనారాయణను సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేశారు. లాయర్లు సిరికొండ సంజీవరావు, హన్మంత్ రెడ్డి, గోకుల రామారావు, ఆకుల యుగేందర్, పీఠం ప్రదీప్​, ఆంజనేయులు,  పల్లవి, రజిత,  ప్రసన్న, బీజేపీ మంథని ఇన్​చార్జ్​ రేండ్ల సనత్ కుమార్  పాల్గొన్నారు.

కేసీఆర్  కామెంట్లే కారణం: రాజాసింగ్

హైదరాబాద్ , వెలుగు:  హాలియా సభలో సీఎం కే‌‌సీఆర్​ రెచ్చగొట్టే విధంగా చేసిన కామెంట్లే లాయర్​ దంపతుల హత్యలకు కారణమని, ఈ కేసులో కేసీఆర్​ పాత్ర కూడా ఉందని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్  అన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తే  లాయర్లను హత్య చేయడం దారుణమని, ప్రశ్నిస్తే చంపేస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.  బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ రవీంద్ర ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో గుంజపడుగు’ బస్సు యాత్రను హైదరాబాద్​ ఎల్బీ నగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద రాజాసింగ్ ప్రారంభించి మాట్లాడారు. హత్యలకు పాల్పడిన వారిని , వీటి వెనుక ఉన్న వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ రాంచందర్ రావు డిమాండ్ చేశారు. సీఎం ఫాంహౌజ్ లో పడుకుంటే గూండాలు రాష్ట్రాన్ని ఏలుతున్నారని బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రవీంద్ర అన్నారు.