- చుట్టుముట్టి ఎటాక్ చేసిన వంద మంది
- వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్ల అరెస్టు
- మా వాళ్లనే అరెస్టు చేస్తారా అంటూ అడ్డగింత
- ఇద్దరిని తప్పించిన ఆఫ్రికన్లు
న్యూఢిల్లీ: వీసా గడువు ముగిసిన ముగ్గురు నైజీరియన్లను యాంటీ డ్రగ్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. వారిని పోలీస్ స్టేషన్కు తరలించేందుకు రెడీ అయ్యింది. తమ వాళ్లను అరెస్టు చేశారనే విషయం తెలుసుకున్న వంద మంది ఆఫ్రికన్లు పోలీసులను చుట్టుముట్టారు. వారిని తప్పించేందుకు పోలీసులపై దాడికి దిగారు. అక్కడి నుంచి వెళ్లకుండా పోలీసులను అటకాయించారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని నెబ్సరాయ్ ఏరియాలో జరిగింది. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. వీసా ఎక్స్పైర్ అయినోళ్లను గుర్తించి తిరిగి వారి దేశం పంపించేందుకు సీనియర్ అధికారులతో కూడిన నార్కోటిక్ సెల్ టీం 2.30 గంటలకు నైజీరియన్లు ఉంటున్న నెబ్ సరాయ్ లోని రాజు పార్క్కు వెళ్లింది. ముగ్గురి వీసాలు ఎక్స్పైర్ అయినట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంది. ఇది తెలుసుకున్న వంద మంది ఆఫ్రికన్లు పోలీసులను రౌండప్ చేసి దాడికి పాల్పడ్డారు. ముగ్గురు నైజీరియన్లను విడిపించేందుకు ప్రయత్నించారు. ముగ్గురిలో ఇద్దరు పారిపోగా.. 22 ఏండ్ల
ఫిలిప్ పోలీసులకు దొరికిపోయాడు.
రెండో సారి నలుగురి అరెస్టు..
ఆఫ్రికన్ల దాడి విషయం తెలుసుకున్న నార్కోటిక్ స్క్వాడ్ టీం, నెబ్ సరాయ్ పోలీసులతో కలిసి మళ్లీ సాయంత్రం 6.30 గంటలకు రాజు పార్క్కు వెళ్లింది. ఓ మహిళతో పాటు మొత్తం నలుగురు ఆఫ్రికన్లను అదుపులోకి తీసుకుంది. పోలీసులు మళ్లీ వచ్చారని తెలుసుకున్న ఆఫ్రికన్లు.. ఈసారి ఏకంగా 150 నుంచి 200 మంది అక్కడికి వచ్చి పోలీసులను రౌండప్ చేశారు. నలుగురు ఆఫ్రికన్లను తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అతికష్టం మీద నలుగురిని నెబ్ సరాయ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరిని ఆఫ్రికాకు పంపించేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నలుగురిని కెనే చుక్వు డేవిడ్ విలియమ్స్, ఇగ్వే ఇమ్మాన్యుయేల్ చిమెజీ, అజీగ్బే జాన్, క్వీన్ గాడ్విన్గా పోలీసులు గుర్తించారు.
నైజీరియన్లపై కేసులు
పట్టుబడిన నైజీరియన్లపై ఐపీసీ సెక్షన్ 420/120 బి తో పాటు ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ 14 కింద క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.