యాసంగి సీజన్ లో యూరియా పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైతులకు సరిపడా యూరియా ఉన్నప్పటికీ.. పంపిణీ లోపాల కారణంగా ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతో ప్రత్యేక అధికారులను నియమించింది వ్యవసాయశాఖ. అందులో భాగంగా మంగళవారం (డిసెంబర్ 30) ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా.బి. గోపి.
జిల్లాల్లో యూరియా పంపిణి సక్రమంగా జరిగేలా ప్రత్యేక అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. అడిషనల్ డైరెక్టర్లు కే. విజయ్ కుమార్, బి.నర్సింహారావు, జేడీఏ లు ఎస్.గీత, వి. ఆశాకుమారి, వై.సుచరిత, బి. బాలు, ఎం. శైలజ, డీడీఏ లు ఎం.చంద్రశేఖర్, ఎం. కనుక రాజులకు బాధ్యతలు అప్పగించారు.
ఒక్కొక్క ప్రత్యేక అధికారికి నాలుగైదు జిల్లాలను కేటాయించారు డైరెక్టర్ గోపి. పైలట్ ప్రాజెక్టు కింద యూరియా యాప్ కొనసాగుతున్న ఐదు జిల్లాలో కాకుండా మిగతా జిల్లాలో కూడా యూరియా సక్రమంగా పంపిణి చేసేలా చర్యలు తీసుకోనున్నారు. యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీ గా పంపిణి చేసేలా ప్రత్యేక అధికారులు జిల్లాల్లో పర్యటించి మానిటరింగ్ చేయనున్నారు.
