జిల్లాల పర్యటనకు ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్.. నేతలకు కీలక ఆదేశాలు..

జిల్లాల పర్యటనకు ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్.. నేతలకు కీలక ఆదేశాలు..

ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ మరోసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. త్వరలోనే 10 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు మీనాక్షి నటరాజన్. ఈ క్రమంలో సోమవారం ( జూన్ 23 ) నియోజికవర్గ నేతలతో మాట్లాడిన మీనాక్షి నటరాజన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై సంవిధాన్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచాలని నేతలకు సూచించారు మీనాక్షి నటరాజన్. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులపై ఉందని అన్నారు.

సీనియర్, జూనియర్ తేడా లేకుండా సమన్వయంతో కలిసి పనిచేయాలని నేతలకు సూచించారు మీనాక్షి నటరాజన్.త్వరలోనే ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్న మీనాక్షి నటరాజన్..  ఒక్కో గ్రామంలో నియోజకవర్గ నేతలు రాత్రి బస చేసి పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించారు.నామినేటెడ్ పోస్టులు రాని వారికి చోటు కల్పిస్తామని హామీ ఇచ్చారు మీనాక్షి నటరాజన్.

ఇదిలా ఉండగా.. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, దాని ఆధారంగానే ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో పదవుల పంపిణీ జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. పార్టీలో సీనియారిటీతో పాటు సిన్సియారిటీని ప్రాతిపదికగా తీసుకొని పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ( జూన్ 13 ) పీసీసీ అబ్జర్వర్లు, అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ జూమ్ మీటింగ్​లో మాట్లాడారు. 

నియోజకవర్గాల వారీగా పీసీసీ అబ్జర్వర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా, మండల అధ్యక్షులను ఏ ప్రాతిపదికన నియమించాలి? ఎవరిని నియమించాలి? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్టీ నేతలను ఉద్దేశించి మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా సమాజంలో ఎవరి వాటా వారికే అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతామని చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి పదవిలోనూ సామాజిక న్యాయం పాటించామని, ఇకపై కూడా ఇదే పద్ధతిని పాటిస్తామని అన్నారు.