
ముంబై: ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో ఓ ప్యాసింజర్కు ఇచ్చిన ఫుడ్లో మెటల్ బ్లేడ్ ముక్క కనిపించింది. వారం రోజుల కింద బెంగళూరు నుంచి- శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అంశాన్ని ఆ ప్రయాణికుడు ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఎయిర్లైన్ దర్యాప్తు ప్రారంభించింది. చివరికి ఆ ఫుడ్లో బ్లేడ్ లాంటి ఇనుప ముక్క వచ్చింది వాస్తవమేనని సోమవారం ధ్రువీకరించింది. ఆ వస్తువు క్యాటరింగ్ సిబ్బంది ఉపయోగించే కూరగాయల కటింగ్ మెషిన్ నుంచి వచ్చిందని ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియెన్స్ఆఫీసర్ రాజేశ్ డోగ్రా ఒక ప్రకటనలో తెలిపారు. తనకు విమానంలో ఇచ్చిన ఫుడ్ను కొన్ని సెకన్ల పాటు నమిలిన తర్వాత అందులో మెటల్లాంటి పదార్థం తన నాలుకకు తగిలిందని జర్నలిస్టు, ప్యాసింజర్ మాథుర్స్పాల్ ఎక్స్లో పేర్కొన్నాడు. అదృష్టవశాత్తు తనకు ఎలాంటి హాని జరగలేదని, అదే ఫుడ్ చిన్నపిల్లలకు ఇస్తే పరిస్థితి ఎలా ఉండేదని ఆయన ప్రశ్నించారు. కాగా, ఈ ఘటనపై ఎయిర్ఇం డియా.. ఆ ప్రయాణికుడికి క్షమాపణ చెప్పింది.