- శంషాబాద్ ఎయిర్ పోర్టులో అయ్యప్పస్వాముల ఆందోళన
శంషాబాద్, వెలుగు : శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం అర్ధరాత్రి కొచ్చికి వెళ్లాల్సిన ఎయిరిండియా ఫ్లైట్ సుమారు 5 గంటల పాటు ఆలస్యంగా నడిచింది. దీంతో కొచ్చి మీదుగా శబరిమల వెళ్లాల్సిన సుమారు 230 మంది అయ్యప్ప స్వాములు గంటల పాటు ఎయిర్ పోర్టులో ఇబ్బందులు పడ్డారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కొచ్చికి వెళ్లాల్సిన ఐఎక్స్ 955 విమానం సాయంత్రం 7.15 నిమిషాలకు బయలుదేరాల్సి ఉండగా.. 5 గంటలు ఆలస్యంగా బయలుదేరి వెళ్లింది.
ఈ 5 గంటలు అయ్యప్ప స్వాములతో పాటు ఇతర ప్యాసింజర్లు శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఉండాల్సి వచ్చింది. ఎయిరిండియా సిబ్బందిని, అధికారులను అడిగినా వారు సరైన సమాధానం ఇవ్వలేదని ప్యాసింజర్లు తెలిపారు. ఫ్లైట్ ఏ టైమ్ లో బయలుదేరుతుందో చెప్పలేదని.. అధికారులను అడిగితే సమాధానం దాటవేశారంటూ అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ఫ్లైట్ కొచ్చికి బయలుదేరింది.