అక్బరుద్దీన్ ఓవైసీకి అస్వస్థత..లండన్ లో చెకప్

అక్బరుద్దీన్ ఓవైసీకి అస్వస్థత..లండన్ లో చెకప్

అక్బరుద్దీన్‌ ఆరోగ్యం సీరియస్ హైదరాబాద్‌, వెలుగు: ఎంఐఎం నేత, చాంద్రాయ ణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. గత నెలలో వైద్యం కోసం లండన్​ వెళ్లిన అక్బరుద్దీన్.. 20 రోజులుగా ఇన్​పేషెంట్ గా చికిత్స పొందుతున్నారు. ఆయన శరీరంలో ఐరన్‌ కంటెంట్‌ తక్కువైందని, డాక్టర్లు ఆర్టిఫిషియల్‌గా ఐరన్‌ అందిస్తున్నారని ఎంఐఎం వర్గాలు చెప్పాయి . కొద్దిగా ఆరోగ్యం క్షీణించినా.. ప్రస్తుతం పరిస్థితిని నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారని వెల్లడించాయి. అక్బరుద్దీన్‌ ఒవైసీపై గతంలో హత్యాయత్నం జరిగింది.

ఆ సమయంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన.. పలుమార్లు లండన్‌లో చికిత్స పొందారు.ఇటీవల అసెంబ్లీ ఎలక్షన్ల సమయంలోనూ లండన్‌ వెళ్లి వచ్చారు. అందువల్లే ఎమ్మెల్యే లందరికంటే  ఆలస్యం గా ప్రమాణ స్వీకారం చేశారు. తిరిగి ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతో గత నెలలో లండన్‌ వెళ్లారు.ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ రంజాన్ పండుగ తర్వాత శనివారం రాత్రి దారుస్సలాంలో నిర్వహించిన ఈద్‌ మిలాప్‌ కార్యక్రమంలో అక్బరుద్దీన్ ఆరోగ్యం గురించి పార్టీ శ్రేణులకు వివరించారు. అక్బర్ కోలుకొని, క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.