Team India: భారత అండర్-19 మాజీ వైస్ కెప్టెన్, ఉత్తర ప్రదేశ్ రంజీ స్టార్ అక్షదీప్ నాథ్ ప్రస్తుతం యూఏఈ (UAE) జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. త్వరలో స్కాట్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ సీడబ్ల్యూసీ (CWC) లీగ్-2 ట్రై సిరీస్కు యూఏఈ సిద్ధమవుతున్న వేళ, అక్షదీప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఐర్లాండే ఇండియాను కొట్టినప్పుడు.. మేమెందుకు కొట్టలేం?:
ప్రస్తుతం CWC లీగ్-2 పాయింట్ల పట్టికలో యూఏఈ దిగువన (24 మ్యాచ్ల్లో కేవలం 7 విజయాలు) ఉంది. అయితే రాబోయే సిరీస్లో తమ జట్టు తప్పకుండా గట్టి కంబ్యాక్ ఇస్తుందని అక్షదీప్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మేము స్కాట్లాండ్ను వారి సొంత గడ్డపై ఎప్పుడూ ఓడించలేదు.. కానీ గతంలో ఐర్లాండ్ కూడా ఇండియాను ఎప్పుడూ ఓడించలేదు కదా? బలమైన టీమిండియాపై ఐర్లాండ్ సిరీస్ గెలిచినప్పుడు, కొత్తగా ఏర్పడిన మా యూఏఈ జట్టు కూడా అద్భుతాలు చేయగలదు.. క్రికెట్లో ఏదీ అసాధ్యం కాదని అక్షదీప్ నాథ్ పేర్కొన్నాడు.
యూపీ టీమ్ హ్యాండ్ ఇచ్చింది.. యూఏఈ పౌరసత్వం వచ్చింది:
భారత్ డొమెస్టిక్ క్రికెట్లో వరుసగా పరుగులు సాధించినప్పటికీ, 2022–23లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉత్తర ప్రదేశ్ టీమ్ తనను పక్కన పెట్టేసిందని అక్షదీప్ నాథ్ వాపోయాడు. సరైన అవకాశాల కోసం చూస్తున్న సమయంలో యూఏఈ హెడ్ కోచ్ లాల్చంద్ రాజ్పుత్తో మాట్లాడి దూబాయ్కి షిఫ్ట్ అయ్యా.. అక్కడ డొమెస్టిక్ టోర్నీల్లో రాణించడంతో యూఏఈ ప్రభుత్వం అతనికి నాచురలైజేషన్ ద్వారా పౌరసత్వం (Citizenship) మంజూరు చేసింది. దీంతో వెంటనే యూఏఈ జాతీయ జట్టుకు ఆడే అర్హత సాధించాడు.
ALSO READ : కామన్వెల్త్లో గోల్డ్ హంట్.. మరో 25 పతకాలు ఖాతాలో పడే ఛాన్స్!
2027 వన్డే వరల్డ్ కప్కు క్వాలిఫై అవ్వడమే టార్గెట్:
ఈ ఏడాది నేపాల్లో యూఏఈ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పుడు గ్రౌండ్ లో జాతీయ గీతం వింటుంటే తనకళ్లు చెమర్చాయని, అదొక లైఫ్ ఛేంజింగ్ మూమెంట్ అని అక్షదీప్ భావోద్వేగానికి గురయ్యాడు. భారత్ తరఫున నెరవేరని ఇంటర్నేషనల్ డ్రీమ్ను యూఏఈ తరఫున సాధిస్తున్నానని, 2027 వన్డే వరల్డ్ కప్కు యూఏఈ అర్హత సాధించేలా చేయడమే తన ప్రధాన లక్ష్యమని తేల్చి చెప్పాడు.
