కోటా దవాఖానాలో అన్నీ లోపాలే

కోటా దవాఖానాలో అన్నీ లోపాలే
  • చనిపోయిన పిల్లల సంఖ్య 104
  • ఆక్సిజన్​ అందుబాటులో లేదు
  • అవసరమైన మందులు కరువే
  • కిటికీ అద్దాలన్నీ పగిలి, గదుల్లోకి చలి గాలులు
  • ఒకే బెడ్‌పైన ఇద్దరేసి పిల్లలు
  • ఆస్పత్రిలో స్టాఫ్​ కొరత తీవ్రం
  • కాంపౌండ్​లోనే పందులు

న్యూఢిల్లీ: రాజస్థాన్​ కోటాలోని జేకే లోన్​ హాస్పిటల్ లో ​పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు.   డిసెంబర్​  నెలలోనే అక్కడ 100 మంది పిల్లలు చనిపోయారు.  గురువారంనాటికి ఈ సంఖ్య 104కి పెరిగింది.  ఆస్పత్రిలో లోపాల వల్లే  పిల్లలు చనిపోతున్నారు.   పిల్లల ఐసీయూలకు  ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. అవసరమైన మెడిసిన్​ కూడా  అందుబాటులో లేవు.  కాంపౌండ్​లో పందులు విచ్చల విడిగా తిరుగుతున్నా పట్టించుకునేవారే లేరు.  ట్రీట్​మెంట్​కు సరిపడినంత స్టాఫ్ కూడా లేరు. కిటికీల అద్దాలు పగిలిపోవడంతో ఆస్పత్రి రూముల్లోకి నేరుగా చల్లగాలి  వీయడంతో కూడా పసిపిల్లలు చనిపోవడానికి కారణాలవుతున్నాయి.  పరిస్థితి  రోజురోజుకు సీరియస్​ కావడంతో…ఇప్పుడు ఈ ఇష్యూ  రాజకీయ రంగు పులుముకుంది. కోటా హాస్పిటల్​ ఇష్యూపై బీజేపీ కాంగ్రెస్​ను టార్గెట్​ చేసింది. బీఎస్పీ కూడా  ఈ విషయంలో కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోసింది.  ఇంతమంది చనిపోతున్నా కాంగ్రెస్​ చీఫ్ సోనియా గాంధీ మాత్రం చలించడంలేదని  ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఫైర్​ అయ్యారు.  ఈ ఇష్యూపై  కాంగ్రెస్‌ జనరల్​ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఎందుకు రియాక్ట్​ కావడంలేదని బీఎస్పీ చీఫ్‌ మాయావతి ప్రశ్నించారు.  రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ను టార్గెట్‌ చేస్తూ గురువారం ట్వీట్​ చేశారు. ఈ ఇష్యూను రాష్ట్ర ప్రభుత్వం  సీరియస్​గా తీసుకోలేదని బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్​ సతీశ్​ పూనియా  విమర్శించారు. పరిస్థితిని తెలుసుకునేందుకు కోటా హాస్పిటల్​కు వెళ్లిన బీజేపీ ఎంపీలను కాంగ్రెస్​ వర్కర్లు  అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.  అయితే హెల్త్​క్రైసిస్​ను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర సర్కార్​కు అన్నివిధాలా సాయపడతామని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్​ హామీ ఇచ్చారు.  ఇప్పటికే ఈమేరకు రాజస్థాన్​సీఎం గెహ్లాట్​కు లెటర్​ రాశానని  గురువారం చెప్పారు.

కోటా ఇష్యూను రాజకీయం చేయొద్దని  రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ కోరారు. రాష్ట్రంలో పిల్లల కోసం మొదటి ఐసీయూను కాంగ్రెస్​ గవర్నమెంట్​ 2003లో  ప్రారంభించిందన్నారు.  కోటా లోనూ 2011లో పిల్లల కోసం ఐసీయూను స్టార్ట్​ చేశామని చెప్పారు. కేంద్రం సాయంతో రాష్ట్రంలో ఆరోగ్య సర్వీసుల్ని మరింత మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి గెహ్లాట్​ చెప్పారు.

ఆగని పిల్లల మరణాలు,  ప్రతిపక్షాల ఎటాక్​తో  జరిగిన డామేజ్ ను కంట్రోల్​ చేయడానికి కాంగ్రెస్​ చీఫ్​ సోనియాగాంధీ రంగంలోకి దిగారు. అసలు అక్కడ ఏం జరుగుతోందని రాజస్థాన్​ కాంగ్రెస్ చీఫ్​ అవినాశ్​ పాండేని సోనియా అడిగారు. గురువారం రాజస్థాన్​ చీఫ్​ను ఢిల్లీకి పిలిపించుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. మరణాలపై డిటైల్డ్​ రిపోర్ట్​ను కాంగ్రెస్​ చీఫ్​కు అందజేసినట్టు అవినాశ్​ ఆ తర్వాత మీడియాకు చెప్పారు.

పిల్లల మరణాలను సీరియస్‌గా తీసుకున్న నేషనల్‌ కమిషన్‌ ఫర్‌‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌  చిల్డ్రన్‌ రైట్స్‌ (ఎన్‌సీపీఆర్‌‌) టీమ్‌ హాస్పిటల్​ను సందర్శించి  వైఫల్యాలను తప్పుపట్టింది. బీజేపీ ఎంపీల టీమ్​కూడా  హాస్పిటల్​ను సందర్శించింది.  కోటా ఆసుపత్రి ఘటనలపై లోక్‌సభ స్పీకర్‌‌ ఓం బిర్లా  విచారం వ్యక్తం చేశారు.

కోటా హాస్పిటల్​లో చిన్నపిల్లలు చనిపోవడం కలిచివేస్తోంది. బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లులు బాధలు  సివిల్​ సొసైటీకి సిగ్గుచేటు.  ఆడవాళ్లయి ఉండి కూడా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు దీన్ని అర్థం చేసుకోకపోవడం బాధాకరం – యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్​

ఈ ఇష్యూపై గెహ్లాట్‌‌  సర్కార్​ ఇప్పటికీ నిర్లక్ష్యంగా ఉండటాన్ని  ఖండించాల్సిందే.  కాంగ్రెస్‌‌ పార్టీ టాప్‌‌ లీడర్‌‌‌‌ షిప్‌‌, ఆ పార్టీ లేడీ జనరల్‌‌ సెక్రటరీ దీనిపై రియాక్ట్​ కాకపోవడం బాధగా ఉంది.  చనిపోయినవాళ్ల ఫ్యామిలీ మెంబర్లను ఆమె కలవకపోతే యూపీలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలను కలవడం ఒక డ్రామా అనుకోవాల్సి ఉంటుంది.– బీఎస్పీ చీఫ్​ మాయావతి

చిన్నపిల్లల మరణాలను సర్కార్​ సీరియస్​గా తీసుకుంది. దీనిని రాజకీయం చేయొద్దు.  హాస్పిటల్​లో  చిన్నపిల్లల చావులు నెమ్మదిగా తగ్గుతున్నాయి.   ఈ సంఖ్యను మరింతగా తగ్గిస్తాం.  తల్లులు, పిల్లలు  ఆరోగ్యానికే  మేం టాప్ ప్రియారిటీ ఇస్తాం.​- రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​

హాస్పిటల్​కు  హెల్త్​ మినిస్టర్​ ఇంతవరకు వెళ్లలేదు. పిల్లల్ని  పోగొట్టుకున్న పేరెంట్స్​ తీవ్రమైన బాధలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై  రియాక్ట్​ అవడంలేదు. – రాజస్థాన్​ బీజేపీ చీఫ్​​ సతీశ్​ పూనియా