
వికారాబాద్, వెలుగు: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం తన క్యాంపు ఆఫీస్లో వికారాబాద్ పట్టణానికి చెందిన 359 మంది, మండలానికి చెందిన 254 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఇండ్లు మంజూరైన వాళ్లు వెంటనే పనులను మొదలు పెట్టుకోవాలని సూచించారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నాలుగు విడతల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ అవుతాయన్నారు. వికారాబాద్ నియోజకవర్గానికి 7 వేల ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, ఏడాదికి కొంతమంది చొప్పున అర్హులందరికీ మంజూరు చేస్తామన్నారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇందిరమ్మ మహిళా శక్తి స్టాల్ను కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి సభాపతి ప్రారంభించారు.