ప్రతి రోజు 10 బెయిల్,10 ట్రాన్స్ఫర్ పిటిషన్లు విచారించాలె: సీజేఐ

ప్రతి రోజు 10 బెయిల్,10  ట్రాన్స్ఫర్ పిటిషన్లు విచారించాలె: సీజేఐ

పెండింగ్లో ఉన్న బెయిల్, ట్రాన్స్ఫర్ పిటిషన్లను వేగంగా విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్న 13 బెంచ్లు.. ప్రతి రోజు 10 బెయిల్, 10  ట్రాన్స్ఫర్ పిటిషన్లు విచారించాలని సూచించారు. క్రిస్మస్ నాటికి ఈ విభాగాల్లో పెండింగ్ పిటిషన్ల విచారణ పూర్తి చేయాలన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ట్రాన్స్ఫర్ పిటిషన్లలో ఎక్కువగా కుటుంబ, వివాహ బంధానికి సంబంధించిన వివాదాలు ఉన్నాయి. పిటిషన్లు, లిటిగెంట్లు కేసును ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతుంటారు. ఈ కేసుల్లో న్యాయ సంబంధమైన చిక్కులు ఎక్కువగా ఉండవు. కానీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంటాయి.

ప్రస్తుతంలో 3 వేల ట్రాన్స్ ఫర్ కేసులు పెండింగ్లో ఉన్నాయని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. 13 బెంచ్ ల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి రోజు 10 కేసులను విచారిస్తే, 5 వారాల్లో ట్రాన్స్ఫర్ పిటిషన్లు అయిపోతాయని చెప్పారు. బెయిల్ పిటిషన్లను కూడా ఇదే విధంగా విచారించాలని సూచించారు.