- డ్రగ్స్ ముఠాలు, చొరబాట్లపై ఉక్కుపాదం మోపండి
- అధికారులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశం
బికనేర్: ఇండియా బార్డర్లో వెలసిన అక్రమ కట్టడాలపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఇంటర్నేషనల్ బార్డర్కు15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటిని తక్షణమే కూల్చివేయాలని స్పష్టం చేశారు. ఈమేరకు రాజస్తాన్లోని బికనేర్లో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సరిహద్దు జిల్లాల్లో ఎదురవుతున్న భద్రతాపరమైన సవాళ్లపై హోంమంత్రి సమీక్షించారు. ఈ మీటింగ్లో రాజస్తాన్ సీఎం భజన్ లాల్ శర్మ, సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సరిహద్దు జిల్లాలు బికనేర్, జైసల్మేర్, బార్మర్, శ్రీగంగానగర్, ఫలోదికి చెందిన కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. బార్డర్కు15 కి.మీ. పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని, పాత నిర్మాణాలను కూల్చేయాలని కేంద్ర హోంమంత్రి ఆదేశించినట్టు ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
బార్డర్ జిల్లాల్లో జరుగుతున్న నేరాలు, డ్రగ్స్ ముఠాల వెనుక ఉన్న మూలాలు, వారి నెట్వర్క్లపై లోతైన అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. స్థానిక పౌరులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా సంస్థలను సమన్వయం చేసుకుంటూ ప్రతి సరిహద్దు జిల్లాలోనూ ‘360 డిగ్రీల’ సమగ్ర భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది.సరిహద్దు ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లకు హోంమంత్రి అమిత్ షా కీలక బాధ్యతలు అప్పగించారు. బార్డర్ పరిధిలోని బ్యాంకింగ్ లావాదేవీలు చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించాలని, భారీ స్థాయి వ్యాపార సంస్థల నిధుల వనరులను పరిశీలించాలని ఆదేశించారు.
