న్యూఢిల్లీ: ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలకు బీజేపీ చీఫ్ అమిత్ షా మంగళవారం రాత్రి విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆయా పక్షాల నేతలతో సమావేశమై చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే 300 వరకు సీట్లు సాధిస్తుందని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్షా మంగళవారం రాత్రి ఢిల్లీలోని అశోకా హోటల్లో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, లోక్జనశక్తి పార్టీ అధినేత రాం విలాస్ పాశ్వాన్ తదితరులు ఇందులో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ కూడా ఈ భేటీకి వచ్చే అవకాశముందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్పన్నీర్ సెల్వం కూడా ఎన్డీయే భేటీలో పాల్గొంటారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ తమిలిసై సౌందరరాజన్ ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేసిన భాగస్వామ్య పక్షాలకు ‘థ్యాంక్స్’చెప్పేందుకే అమిత్షా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఎలక్షన్ రిజల్ట్ ఆధారంగా ఎన్డీయే పక్షాలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించే
అవకాశం ఉంది.
తొలుత పార్టీ భేటీ..
ఎన్డీయే పక్షాల భేటీకి ముందు ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్లో ఆ పార్టీ కీలక నేతలు, కేంద్ర మంత్రుల సమావేశం జరుగనుంది. ప్రధాని మోడీ, అమిత్షా సహా పార్టీ సీనియర్లు చాలా మంది ఈ భేటీకి హాజరుకానున్నారు.