సామాన్య ప్రజల రోజూవారి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి వర్షాలు. ఇల్లు దాటి అడుగు బయటపెట్టే పరిస్థితి లేదు. రోడ్లు, ఇల్లు, వాకిలి, ఆఫీసులన్నీ వరద నీళ్లతో నిండిపోయాయి. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే.. ఓ అమ్మాయి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె చేసిన పనేంటో చెప్తే.. ఇదేంది? అని ముక్కున వేలేసుకునేవాళ్లు కూడా ఉన్నారు. వారెవ్వా.. శెభాష్ అని మెచ్చుకునేవాళ్లు కూడా ఉన్నారు. ఇంతకీ ఆమేం చేసిందని ఆలోచిస్తున్నారా? బిహార్ వరదల్లో ఫ్యాషన్ ఫొటోషూట్ చేసింది. పేరు అదితి సింగ్.
మోకాళ్ల లోతు బురద నీళ్లు, ఆ నీళ్లలో అడుగు పెట్టాలంటే.. ఎక్కడ మ్యాన్హోల్ ఉందో.. ఎక్కడ నాలా ఉందో తెలియని పరిస్థితి. దీనికి కారణాలు ఏవైనా కావొచ్చు. ఈ విషయం గురించి నిరసన తెలపాలంటే ఇప్పుడు అక్కడున్న పరిస్థితి సరైంది కాదు. అక్కడ నిరసన కంటే.. సాయం ముఖ్యం. కానీ.. భవిష్యత్తులో మరోసారి భారీ వర్షాలొస్తే.. ఈ పరిస్థితి మరోసారి తలెత్తే అవకాశం ఉంది. మరేం చేయాలి? నిరసన తెలపాల్సిందే.
తన నిరసనకు, తను చదువుతున్న కోర్సునే మార్గంగా ఎంచుకుంది. పాట్నాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్ అయిన అదితి సింగ్ బిహార్ వరదల పరిస్థితిని, అక్కడి ప్రజల ఇబ్బందులను అందరి దృష్టికి తీసుకురావాలని ఆలోచించింది. అందుకే.. మోకాళ్లలోతు బురద నీళ్లలో దిగి ఫ్యాషన్ ఫొటోలు షూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలను చూసిన చాలామంది ఫాలోవర్లు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్లు ‘చాలా స్టైల్గా నీ నిరసన తెలిపావ్.. శెభాష్.. ఫ్యాషన్ స్టూడెంట్ అనిపించుకున్నావ్’ అంటున్నారు. అదితితో ఫొటోగ్రఫీ చదువుతున్న ఆమె ఫ్రెండ్ సౌరవ్ అనురాజ్ ఈ ఫొటోలను తీశాడు. నీళ్లలో మునిగిపోయిన కార్లు, బురద నీళ్లతో కనిపించకుండా పోయిన రోడ్లు, జనావాసాల మధ్య ఫొటోషూట్ తీసి.. వరద బీభత్సం అక్కడి ప్రజలను ఎంతలా ఇబ్బంది పెడుతోందో చాలా సున్నితంగా తెలియజేశారు.