
- ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం
- 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి
- కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఉచిత వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం అమరావతిలోని సెక్రటేరియెట్ లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈ పాలసీని అమలు చేయనున్నారు.
ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికీ హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.63 కోట్ల కుటుంబాలకు ఈ హెల్త్ పాలసీ వర్తించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో హైబ్రిడ్ విధానం ద్వారా ప్రభుత్వం ఉచిత వైద్యసేవలు అందజేయనుంది. మొత్తం 3,257 చికిత్సలను పూర్తిగా ఉచితంగా అందిస్తారు.
ప్రీ-ఆథరైజేషన్ మేనేజ్మెంట్ ద్వారా 6 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసే విధానం అమల్లోకి రానుంది. రూ.2.5 లక్షలలోపు ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీలు భరించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వైద్య ఖర్చులు భరించనుంది. ఈ కొత్త పథకం 1.43 కోట్ల పేద కుటుంబాలు, 20 లక్షల ఇతర కుటుంబాలకు వర్తించనుంది. మరోవైపు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకూ ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తారు.