
అమరావతి-, వెలుగు: ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన ఇంజనీరింగ్ పనులను ఆపాలని అన్ని శాఖలకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశించారు. పనుల్లో నిధులు వ్యయం, బిల్లుల మంజూరుపై స్పష్టతనిస్తూ గురువారం మెమో జారీ చేశారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితులు పట్టించుకోకుండా మంజూరు చేసిన ఇంజనీరింగ్ పనులు రాష్ట్ర ఖజానాపై భారం పడేలా చేశాయని, ప్రాధాన్యతలను పట్టించుకోకుండా చేపట్టిన కొన్ని ప్రాజెక్టు పనుల్ని సమీక్షించాల్సి ఉందన్నారు. చెల్లింపులకు ఆర్థిక వనరులు లేనందున అన్ని శాఖలు సదరు ఇంజనీరింగ్ పనులు ఆపాలని ఆదేశించారు. ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరై ఇంకా ప్రారంభించని పనుల్ని రద్దు చేయాలని ప్రభుత్వ శాఖలకు సూచించారు.
25 శాతం కూడా పనులు పూర్తి కాని ప్రాజెక్టుల విషయంలో విలువను తాజాగా నిర్ధారించి తదుపరి చెల్లింపులు చేయొద్దని స్పష్టం చేశారు. పేదల సంక్షేమంతోపాటు అవినీతి రహిత పాలన అందించటమే కొత్త ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నందున శాఖల కార్యదర్శులంతా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని మెమోలో స్పష్టం చేశారు. విభాగాధిపతులు, అధికారులు తాజా నిబంధనల ప్రకారం ధ్రువీకరించిన పనులకు మాత్రమే చెల్లింపులు చేయాలని పే అండ్ ఆకౌంట్స్ కార్యాలయానికి సీఎస్ ఆదేశించారు.