బలపడుతున్న నైరుతి .. వారం తర్వాత రుతుపవనాల కదలికల్లో వేగం

 బలపడుతున్న నైరుతి .. వారం తర్వాత రుతుపవనాల కదలికల్లో వేగం
  • వారం తర్వాత రుతుపవనాల కదలికల్లో వేగం
  • ఐఎండీ తాజా అంచనాల్లో వెల్లడి
  • నాలుగు రోజులుగా మండిన ఎండలు
  • 150కిపైగా మండలాల్లో వడగాడ్పులు.. 
  • సాయంత్రం కాగానే కొన్ని జిల్లాల్లో వానలు

హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాలు బలపడేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ వారం దాటితే మాన్సూన్​ మరింతగా విస్తరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఐఎండీ చెబుతున్నది. ప్రస్తుతానికి రుతుపవనాలు బలహీనంగానే ఉన్నా.. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలుంటాయని పేర్కొంది. జులై 1 వరకు రాష్ట్రంలో ఉండే వాతావరణ పరిస్థితులపై ఐఎండీ తాజా అంచనాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా వేడిగాలుల ప్రభావం, పశ్చిమ, తూర్పుగాలుల మధ్య హోరాహోరీ ఎఫెక్ట్​తో రుతుపవనాలు స్తంభించిపోయాయి. 

అయితే, తాజాగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ పేర్కొంది. తక్కువ ఎత్తులో ఉండి తేమను తీసుకొచ్చే సోమాలి జెట్​ (హిందూమహాసముద్రం నుంచి అరేబియా సముద్రంవైపు వీచే గాలులు) వచ్చేవారం బలపడతాయని తెలిపింది. ఇటు తేమను కలిగి ఉండే క్రాస్​ ఈక్వెటోరియల్​ ఫ్లో (భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లి మళ్లీ తిరిగొచ్చే పవనాలు) కూడా 24వ తేదీ నాటికి బలం పుంజుకునే అవకాశాలున్నాయని వెల్లడించింది.

అలాగే, తెలంగాణతో పాటు కోర్​ మాన్సూన్​ జోన్​లోని రాష్ట్రాలపై వెస్టర్లీస్​ ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఈ నెల చివరి వారంలో దక్షిణాది రాష్ట్రాల్లో తూర్పు గాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఫలితంగా వచ్చే వారం చివరి నాటికి రుతుపవనాలు బలపడి.. మరింత ముందుకు కదిలేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే, మాన్సూన్​ బలపడినా.. జులై చివరి నాటికి లేదా సెప్టెంబర్​ తొలి వారంలో ఎల్​నినో మరింత బలపడుతుందని, ఇప్పటికే పసిఫిక్​లో దాని తీవ్రత ఎక్కువైందని 
ఐఎండీ హెచ్చరించింది. 

నాలుగు రోజులుగా హీట్​ వేవ్స్​

జూన్​ తొలివారం నుంచే ఎండల నుంచి సాధారణంగా ఉపశమనం లభిస్తుంది. కానీ, ఈ ఏడాది మాత్రం మూడో వారంలోకి ఎంటరైనా ఎండలు మాత్రం తగ్గడం లేదు. రెండో వారంలో కొంత బ్రేక్​ ఇచ్చినట్టే కనిపించినా.. మళ్లీ నాలుగు రోజులుగా టెంపరేచర్లు పెరుగుతూ వస్తున్నాయి. హీట్​వేవ్స్​ పరిస్థితులూ ఉంటున్నాయి. పలు జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులుగా 150కిపైగా మండలాల్లో వడగాడ్పులు రికార్డవుతున్నాయి. గురువారం 146 మండలాల్లో హీట్​వేవ్స్, మరో 29 మండలాల్లో తీవ్రమైన హీట్​వేవ్స్ నమోదయ్యాయి. 23 జిల్లాల్లో వడగాడ్పుల పరిస్థితి ఉందంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్​, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్​ జిల్లాల్లో హీట్​వేవ్స్​ తీవ్రంగా ఉన్నట్టు డెవలప్​మెంట్ అండ్​ ప్లానింగ్​ సొసైటీ డేటా స్పష్టం చేసింది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో హీట్​వేవ్స్​ ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. దాంతో పాటు సాయంత్రం సమయంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్​ ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. 

పొద్దున ఎండలు.. సాయంత్రం వర్షాలు..

గురువారం పొద్దంతా ఎండలు దంచికొట్టినా.. సాయంత్రంకాగానే హైదరాబాద్​ సిటీ సహా పలు జిల్లాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. సిటీలో వర్షం పడింది కాసేపే అయినా.. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జగిత్యాల జిల్లా పూడూరులో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా తాండూరులో 43 డిగ్రీలు రికార్డ్​ అయింది. నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో 42.8 డిగ్రీలు, నిజామాబాద్​ 42.7, కుమ్రంభీం ఆసిఫాబాద్​, వరంగల్​లో 42.6, జయశంకర్​ భూపాలపల్లిలో 42.2, ఆదిలాబాద్​ 42.1, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్​ జిల్లాల్లో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

హైదరాబాద్​ సిటీలోనూ 40 డిగ్రీల మేర టెంపరేచర్​ రికార్డయింది. చార్మినార్, నాగోల్, గోషామహల్, సరూర్​నగర్​ సర్కిళ్లలో 40 డిగ్రీల రేంజ్​లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్​, వరంగల్, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్​నగర్​ జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో మాటూరులో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా టీక్యాతండాలో 5.6 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 5.5, యాదాద్రి జిల్లా మోత్కూరులో 4.5, నల్గొండ జిల్లా తిమ్మాపూర్​లో 3.7, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో 3.7, ముకుందాపురంలో 3.6, రెడ్డిగూడలో 3.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్​ సిటీలోనూ పలు చోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఆదర్శ్​నగర్​లో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఫతేనగర్​లో 3 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్​లో 3, బాలానగర్​లో 2.7, మైత్రీవనంలో 2.6, శ్రీనగర్​ కాలనీలో 2.4, బోయినపల్లిలో 2.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

వర్షాలు తక్కువే..

రాష్ట్రంలో ఈ రెండు వారాల పాటు సాధారణం కన్నా తక్కువ వర్షాలే పడుతాయని ఐఎండీ అంచనాల్లో పేర్కొంది. కేవలం కొంకణ్​, గోవా, కర్నాటక, రాయలసీమ, కేరళ, తమిళనాడుల్లో మాత్రమే సాధారణం లేదా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మిగతా దేశమంతా లోటు వర్షపాతమే రికార్డ్​ అవుతుందని హెచ్చరించింది. అదే సమయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో హీట్​వేవ్స్​ లాంటి పరిస్థితులు ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ నెల 24 వరకు రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో వరుసగా ఈ మూడు రోజుల పాటు హీట్​వేవ్స్​ ఉంటాయని హెచ్చరించింది. చివరి వారంలో ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపింది.