- ఇంజినీరింగ్ కోర్ బ్రాంచ్ల్లో పెరుగుతున్న అడ్మిషన్లు
- నేటి నుంచి ఎప్సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్ అంటేనే ‘కంప్యూటర్ సైన్స్’ అన్నట్లుగా సాగిన దశాబ్ద కాలపు ట్రెండ్.. ఇప్పుడు యూ-టర్న్ తీసుకుంటోంది. ఐటీ రంగంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీలి నీడలు కమ్ముకోవడం, అంతర్జాతీయ కంపెనీల్లో నిరంతర లేఆఫ్స్ కొనసాగుతుండటంతో పేరెంట్స్, స్టూడెంట్ల ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ వైపు గుడ్డిగా వెళ్లడం కంటే.. ఎవర్ గ్రీన్ బ్రాంచ్లైన సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి సంప్రదాయ కోర్సుల్లో చేరడమే సేఫ్ అని అభ్యర్థులు భావిస్తున్నారు. కోర్బ్రాంచ్లు తీసుకున్నా అవసరమైతే సాఫ్ట్ వేర్ వైపు వెళ్లొచ్చని, లేదంటే సర్కారు కొలువులు, ప్రైవేట్ జాబులు చేయవచ్చనే ఆలోచన మొదలైంది. ఈ క్రమంలో నేటి నుంచి ఎప్సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రంలో 179 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1.24 లక్షల సీట్లున్నాయి. వీటిలో 70శాతానికి పైగా సీట్లు కంప్యూటర్ సైన్స్ , దాని అనుబంధ కోర్సులవే. మొత్తం సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటాలో సర్కారు కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తుంది. కంప్యూటర్ సైన్స్కు ఉన్న క్రేజ్ కారణంగా గతంలో కోర్ బ్రాంచ్ల్లో సీట్లు మిగిలిపోయేవి. దీంతో చాలా కాలేజీలు కోర్ బ్రాంచీల సెక్షన్లు ఎత్తేశాయి. ప్రభుత్వం జోక్యం చేసుకొని భవిష్యత్అవసరాల నేపథ్యంలో కోర్ గ్రూపులు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా ప్రతి కాలేజీలో కోర్ బ్రాంచీలు ఉండాలని యూనివర్సిటీలు నిబంధనలు తెచ్చాయి. దీంతో ప్రతి కాలేజీలో కొన్ని కోర్సులు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.
ఏఐ రాకతో అలర్ట్..
ఏఐ టూల్స్ రాకతో సాఫ్ట్వేర్ రంగంలో ప్రైమరీ స్థాయి ఉద్యోగాలు తగ్గిపోతాయనే అభిప్రాయాలు నెలకొన్నాయి. ఒకప్పుడు సీఎస్ఈలో సీటు దొరకడమే గొప్పగా స్టూడెంట్లు భావించేవారు. కానీ, ఇప్పుడు సాఫ్ట్వేర్ కొలువుల్లో గ్యారంటీ లేదనే ఆందోళనతో.. అటు ప్రభుత్వరంగం, ఇటు ప్రైవేట్ తయారీ రంగంలో స్థిరమైన అవకాశాలు ఉండే కోర్ గ్రూపుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లకు గతంలో ఉన్నంత పోటీ ఈ మధ్య కనిపించడం లేదు. నాలుగేళ్ల డేటాను పరిశీలిస్తే.. కోర్ గ్రూపుల్లో అడ్మిషన్ల శాతం పెరుగుతున్నవిషయం స్పష్టమవుతుంది.
సంప్రదాయ కోర్సులకు పూర్వవైభవం
మూడేండ్ల డేటాను పరిశీలిస్తే.. సివిల్, మెకానికల్, ఈఈఈ విభాగాల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ఇందుకు కోర్ బ్యాంచ్లలో సీట్లు తగ్గడం, ఉన్న సీట్లకు డిమాండ్ పెరగడం ప్రధాన కారణాలు. 2022-–23లో కేవలం 30.57 శాతంగా ఉన్న కోర్ అడ్మిషన్లు, 2024–25 నాటికి ఏకంగా 80.09 శాతానికి, 2025–26లో 63 శాతానికి
చేరడం గమనార్హం.
