రైతులు ఆగమయ్యారు.. ప్రభుత్వం  ఆదుకోవాలని డిమాండ్​

రైతులు ఆగమయ్యారు.. ప్రభుత్వం  ఆదుకోవాలని డిమాండ్​

అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందన్న ఆయన.. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయన్నారు. వరి,మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారని తెలిపారు. బాధిత రైతులకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.. దెబ్బ తిన్న పంటల గణనను సత్వరమే చేపట్టి, మానవతా దృక్పథంతో నష్ట పరిహారాన్ని చెల్లించాలని కోరారు. వరి సాగు చేసిన రైతులను ఈ వర్షాలు తీవ్రంగా దెబ్బ తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైఖరితో రైతులకు నష్టం

ధాన్యం కొనుగోలు పకడ్బందీగా సాగటం లేదని విమర్శించారు పవన్‌ కల్యాణ్‌. గోదావరి జిల్లాల్లో సాగు చేసిన జయ రకం (బొండాలు) ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఆర్బీకేల్లో తీసుకోకపోవడం వల్ల ఒక్కో బస్తాను  300 రూపాయిల  నష్టంతో మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ వైఖరి మూలంగా కష్టపడిన రైతు నష్టపోతున్నాడని జనసేనాని అన్నారు.  దళారులు, మిల్లర్లు లాభపడుతున్నారన్నారని పవన్​కళ్యాణ్​ అన్నారు .