
- రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి
పాలమూరు, వెలుగు: తెలంగాణను స్పోర్ట్స్ హబ్ గా తయారుచేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు. పాలమూరు ఇండోర్ స్టేడియంలో బుధవారం రాష్ట్ర స్థాయి అండర్-–23 పురుషులు, మహిళల అంతర్ జిల్లా బాస్కెట్ బాల్ చాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్లుగా క్రీడలను నిర్లక్ష్యం చేశారని, బడ్జెట్లో రూ.50 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు.
గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.360 కోట్లు, ఈ ఏడాది రూ.460 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. అన్ని జిల్లాల్లో క్రీడా మైదానాలు అభివృద్ధి చేయడంతో పాటు అకాడమీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్లో 35 ఏండ్ల తరువాత సంతోష్ ట్రోఫీ నిర్వహించామని తెలిపారు. జిల్లాలో క్రీడల అభివృద్ది కోసం రూ.16 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇండోర్ స్టేడియంలో ఏసీ, ఇతర మౌలిక వసతులు, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావుల శ్రీదర్ రెడ్డి, పృథ్వీశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్, నసరుల్లా హైదర్, మనోహర్ రెడ్డి, కురుమూర్తి, సుబాన్, మీర్ ఖలేద్ అలీ, ఎండీ ఇలియాజ్, పారుఖ్ ముకర్రం, బాల్ రాజు, గోపాలకృష్ణ పాల్గొన్నారు.