డీఎస్సీ పోస్టులకు దరఖాస్తులు అంతంతే

డీఎస్సీ పోస్టులకు దరఖాస్తులు అంతంతే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు నిర్వహించనున్న డీఎస్సీకి దరఖాస్తులు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. నెలరోజుల నుంచి కొత్తగా 37,700 వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఇప్పటికే గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్​ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం పాత నోటిఫికేషన్​ను రద్దు చేసి, 11,062 పోస్టులతో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి4 నుంచి డీఎస్సీ అప్లికేషన్లు మరోసారి ప్రారంభించి, ఏప్రిల్ 3 వరకు గడువు పెట్టింది.

అయితే, టెట్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు గడువును జూన్ 20 దాకా పెంచింది. దీంతో అప్లై చేసుకోవాల్సినోళ్లు చివర్లో చేద్దామనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 27,500, ఎస్​జీటీ పోస్టులకు 4,500, ఎస్​జీటీ(స్పెషల్ ఎడ్యుకేషన్)కి 800, ఎస్​ఏ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులకు 550 మంది దరఖాస్తు చేసుకున్నారు. పీఈటీ పోస్టులకు 2,200, లాంగ్వేజీ పండిట్ల కోసం 2,250 మంది అప్లై చేశారు. కాగా, గతంలోనే అప్లై చేసిన 1.77 లక్షల మంది మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు.