ముంబై: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఘట్కోపర్-కుర్లా రహదారి వెంబడి ఉన్న అశోక్ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. బుధవారం (ఆగస్ట్ 12) తెల్లవారుజూమున 3 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, 108 అంబులెన్స్ సర్వీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, వార్డు సిబ్బంది బృందాలు ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అత్యవసర బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ముంబై పోలీసులు, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వివరాల ప్రకారం.. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీసి సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. శిథిలాల కింద ఎనిమిది మంది వరకు చిక్కుకుని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
ముందే హెచ్చరించిన వినలే:
కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలోని ఇళ్లకు వర్షాకాలానికి ముందే నోటీసులు జారీ చేశామని బీఎంసీ అధికారి గజానన్ జైతాప్కర్ తెలిపారు. హెచ్చరించినప్పటికీ ఇండ్లు ఖాళీ చేయకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఘటన స్థలంలో అధికారులు ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేస్తూ.. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందన్నారు.
►ALSO READ | అమెరికాలో అదానీకి ఊరట.. కేసులను కొట్టేసిన US కోర్టు
