హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్కుమార్ (పీసీ-8968) కుటుంబసభ్యులకు డీజీపీ సీవీ ఆనంద్ రూ. కోటి బీమా అందించారు. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య సహా ఇతర అధికారులతో కలిసి సోమవారం తన కార్యాలయంలో చెక్కు అందజేశారు.
మల్కాజిగిరి కమిషనరేట్ 2018 బ్యాచ్కు చెందిన చరణ్కుమార్ ఈగల్ ఫోర్స్లో డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. 2025 సెప్టెంబర్ 22న అర్ధరాత్రి విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని దేవార్కర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో చరణ్కుమార్ తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స అనంతరం 2025 అక్టోబర్ 28న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ యశోద ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే చరణ్కుమార్ చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఎస్పీ రఘువీర్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి తదితర అధికారులు ఎస్బీఐతో సమన్వయం చేసి బీమా క్లెయిమ్ను పూర్తి చేశారు.
