
2022 ఏడాదికిగానూ ఎమర్జింగ్ క్రికెట్ అవార్డు నామినీలను ఐసీసీ ప్రకటించింది. ఈ లిస్టులో నలుగురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా యంగ్ పేసర్ అర్ష్దీప్ సింగ్తో పాటు..సౌతాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్, అఫ్గానిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్, న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్ ఎమర్జింగ్ క్రికెట్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.
అర్ష్దీప్ అదుర్స్..
2022లోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన టీమిండియా లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్..ఇప్పటి వరకు 21 టీ20ల్లో 18.12 యావరేజ్తో 32 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో బెస్ట్ ప్రదర్శనతో భారత్ జట్టులో చోటు దక్కించుకున్న అర్ష్ దీప్ సింగ్..కొత్త బంతితో పాటు.. డెత్ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్తో సత్తా చాటాడు. టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై మూడు వికెట్లతో ఔరా అనిపించాడు.
ఈ అవార్డు రేసులో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ కూడా ఉన్నాడు. అతను టెస్టులు, వన్డేలు, టీ20ల్లో రాణిస్తున్నాడు.ఇప్పటి వరకు తొమ్మిది టెస్టులాడిన జాన్సెన్ 41 వికెట్లు పడగొట్టాడు. అటు అఫ్గానిస్తాన్ బ్యాట్స్ మన్ ఇబ్రహీం జాద్రాన్ వన్డేల్లో, టీ20ల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. 8 వన్డేల్లో 432 పరుగులు చేయగా..ఇందులో మూడు సెంచరీలు ఉండటం విశేషం. వీరితో పాటు..న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్ అవార్డు కోసం పోటీ పడుతున్నాడు. తన కెరీర్లో 25 టీ20లు ఆడిన ఫిన్ అలెన్.. 163.4 స్ట్రైక్ రేట్తో 567 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.