
- వానాకాలం నేపథ్యంలో గోదావరికి వరద సూచనలు
- బ్యారేజీ దగ్గర పూర్తి కాని రిపేర్లు
- వానాకాలంలో మూడు బ్యారేజీల గేట్లు ఎత్తే ఉంచాలన్న ఎన్డీఎస్ఏ
- నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్టు తర్వాతే పనుల అంశం కొలిక్కి వచ్చే ఛాన్స్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : రాష్ట్రంలో వానాకాలం సీజన్ మొదలైంది. గోదావరికి వరదలు మొదలయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ వర్షాకాలంలో మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు ఎత్తే ఉంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇదివరకే ఆదేశించింది. మూడు బ్యారేజీల దగ్గర చేపట్టిన రిపేర్లు పూర్తయ్యాక మరోసారి పరిశీలించి ఏం చేయాలనే దానిపై నివేదిక అందజేస్తామని కమిటీ ప్రకటించింది. దీంతో గోదావరి వరదకు అడ్డుగా నిర్మించనున్న జియో ట్యూబ్స్ పనులు చేయడానికి సర్కారు ఇంజినీర్లు వెనకా ముందు ఆలోచిస్తున్నారు.
బ్యారేజీల దగ్గర కొనసాగుతున్న రిపేర్లు
నేషనల్ డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆదేశాల మేరకు భూమిలోకి కుంగిన మేడిగడ్డ బ్యారేజీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం రిపేర్లు చేయిస్తోంది. దీంతో పాటు బుంగలు పడిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద కూడా రిపేర్లు నడుస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్లోని 19 పిల్లర్కు వచ్చిన క్రాక్లను ఇంజినీర్లు సిమెంట్ గ్రౌంటింగ్ చేసి ఫిలప్ చేశారు. క్రాక్లు బయటికి కనిపించకుండా పనులు చేశారు.
బ్యారేజీలో మొత్తం 84 గేట్లు ఉండగా ఇది వరకే 83 గేట్లను ఎత్తారు. మిగిలిన 20వ నంబర్ గేట్ ఎత్తడానికి వీలు కాకపోవడంతో కట్ చేసి గేట్నే తొలగిస్తున్నారు. ఏడో బ్లాక్లో మొత్తం 210 మీటర్ల పొడవునా భూమిలోకి వేయాల్సిన షీట్ ఫైల్స్ పని 80 శాతం పూర్తయ్యింది. బ్యారేజీ అప్, డౌన్ స్ట్రీమ్లలో కొట్టుకుపోయిన సీసీ బ్లాక్లను సిమెంట్, ఇసుక మిక్చర్తో కలిపి ఫిలప్ చేస్తున్నారు.
పిల్లర్ల ముందు కుంగిన బేస్ మెంట్పై సిమెంట్ లేయర్ వేసి లెవెల్ చేశారు. ఏడో బ్లాక్లోని 19,20,21 పిల్లర్ల మధ్యలో ఏర్పడిన నేల బొయ్యారాన్ని సిమెంట్, కెమికల్ కాంక్రీట్తో పూడుస్తున్నారు. అన్నారం బ్యారేజీ దగ్గర కూడా రిపేర్లు దాదాపు పూర్తి కావచ్చాయి. కానీ, సుందిళ్ల బ్యారేజీ దగ్గర రిపేర్లు చాలా ఆలస్యంగా మొదలయ్యాయి. ఈ నెల 7న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుందిళ్ల బ్యారేజీ పరిశీలించినప్పుడు కూడా అక్కడ రిపేర్లు మొదలు కాలేదు. మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పనులు మొదలుపెట్టారు. ఈ సారి గోదావరి వరదలు వచ్చేనాటికి ఇక్కడ రిపేర్లు పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదు.
అన్నారం, సుందిళ్ల దగ్గర వాటర్ లిఫ్టింగ్ ఎట్లా?
మేడిగడ్డ బ్యారేజీ గేట్లు తెరిచి ఉంచినప్పటికీ ఈ సారి జియో ట్యూబ్స్ వేసి వరదను కన్నెపల్లి పంప్హౌస్లోకి మళ్లించి వాటర్ లిఫ్ట్ చేయాలని ఇంజినీర్లు భావించారు. దీని కోసమే గోదావరిలో వరదకు అడ్డంగా జియో ట్యూబ్స్ పనులు చేయాలని అనుకున్నారు. మేడిగడ్డ దగ్గర లిఫ్ట్ చేసిన నీళ్లు అన్నారం బ్యారేజీలోకి, అన్నారం దగ్గర లిఫ్ట్ చేసిన వాటర్ సుందిళ్ల బ్యారేజీలోకి పోతున్నాయి.
కేవలం మేడిగడ్డ బ్యారేజీ దగ్గర మాత్రమే జియో ట్యూబ్స్ వేసి వాటర్ లిఫ్ట్ చేస్తే ప్రయోజనం ఉండదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ సారి వానాకాలంలో మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీ గేట్లన్నీ తెరిచే ఉంచాలని ఎన్డీఎస్ఏ ఆదేశాలున్నాయి. దీనివల్ల మేడిగడ్డ బ్యారేజీ నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లు తిరిగి కిందికే వెళతాయంటున్నారు. అన్నారం, సుందిళ్ల పంప్హౌస్లలో వాటర్ స్టోరేజీ లేని కారణంగా పంప్హౌస్ దగ్గరికి బ్యాక్ వాటర్ చేరుకోదని చెబుతున్నారు.
దీనివల్ల కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లను మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎత్తిపోసినట్లు మాత్రమే అవుతుందని, ఎల్లంపల్లి బ్యారేజీ వరకు లిఫ్ట్ చేస్తేనే ఆయకట్టు పంట పొలాలకు కాళేశ్వరం నీళ్లు అందినట్లు అవుతుందంటున్నారు. కాబట్టి మూడు బ్యారేజీల దగ్గర రిపేర్లు కంప్లీట్ చేశాక ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీమ్ నివేదికను బట్టి జియో ట్యూబ్స్ వర్క్స్ మొదలుపెట్టే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఈ సారి వానాకాలం కంప్లీట్ అయ్యాకనే జియో ట్యూబ్స్ పనుల విషయంలో ముందుకు వెళ్తామని ఇంజినీర్లు అంటున్నారు.