అలంపూర్, వెలుగు: జోగులాంబ అమ్మవారికి హైదరాబాద్ పాతబస్తీలోని నల్ల పోచమ్మ మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బోనాలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 500 మంది భక్తులు శనివారం రాత్రి అలంపూర్ పట్టడానికి చేరుకొని విడిది చేశారు. ఆదివారం ఉదయం బోనాలు సిద్ధం చేసుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, వెండి బోనంతో మరో 50 బోనాలతో డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు.
బోనం ఎత్తుకున్న జోగిని వెంట రాగా, పట్టణంలోని వాసవీ సత్రం నుంచి ప్రధాన వీధుల గుండా ఆలయానికి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడాది ఏపీలోని విజయవాడ కనకదుర్గతో పాటు జోగులాంబ అమ్మవారికి నల్ల పోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాలు సమర్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
జోగులాంబ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు నల్ల పోచమ్మ మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు తరలిరావడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. తెలంగాణ మేకలు, గొర్రెల కమిషన్ చైర్పర్సన్ సరిత హాజరయ్యారు.
