బిశ్వనాథ్ చరియాలి: భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనకుండా అస్సాం సర్కారు ప్రజలను బెదిరిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు. తన రూట్ లో కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తోందని తెలిపారు. “యాత్ర మార్గంలో మేం సుదీర్ఘ ప్రసంగాలు ఇవ్వం. మేం ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు ప్రయాణిస్తాం. పలువురు ప్రతినిధులతో మాట్లాడుతాం. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటాం. ఆ సమస్యలపై మేం పోరాటం చేస్తాం. యాత్ర లక్ష్యం ఇదే. ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ భారీ తేడాతో బీజేపీని ఓడిస్తుంది. బెదిరించినా, కొట్టినా ప్రజల కోసమే పోరాడతాం. రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన బ్యానర్లు, జెండాలను ధ్వంసం చేస్తున్నారు. ప్రజలను బెదిరించి వారిని అణగదొక్కాలని అస్సాం సర్కారు చూస్తోంది. కానీ, ఈ యాత్ర రాహుల్ గాంధీది కాదు. ప్రజల గొంతుకను వినిపించడానికి చేపడుతున్న యాత్ర” అని రాహుల్ గాంధీ చెప్పారు.
బీజేపీ కార్యకర్తల నినాదాలు..రాహుల్ ప్లైయింగ్ కిస్సెస్..
నాగావ్: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసు కుంది. అస్సాంలోని నాగావ్లో యాత్ర కొనసాగుతుండగా రాహుల్ ముందు కొంత మంది బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్, మోదీ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా రాహుల్ వారికీ చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ప్లైయింగ్ కిస్సెస్ ఇచ్చారు. ఈ వీడియోను రాహుల్ ట్వీట్ చేశారు. ‘‘మా ప్రేమ దుకాణం అందరికీ తెరిచే ఉంటుంది. భారత్ ఏకమవుతుంది, భారత్ గెలుస్తుంది” అని చెప్పారు.